సీమాంధ్రపై వెంకయ్య: టిడిపిలోకి సిటీకేబుల్ ఎండి
హైదరాబాద్/విజయవాడ/విజయనగరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఫ్రంట్కు ఓటేస్తే కాంగ్రెసుకు ఓటేసినట్లేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారం అన్నారు. మూడో ఫ్రంటుకు ఓటు వేస్తే పరోక్షంగా కాంగ్రెస్కు వేసినట్లవుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే పొత్తులు ఉంటాయని, ఎవరు కలసి వచ్చినా రాకపోయినా బిజెపి ముందుకు వెళుతుందన్నారు.
నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మోడీని అడ్డుకోలేరన్నారు. పోలవరం నిర్మాణానికి ఆర్డినెన్స్ చేయాలని ఒత్తిడి తెస్తున్నామని, సీమాంధ్ర ప్రాంత సమస్యల పరిష్కారం బిజెపితోనే సాధ్యమన్నారు. విజయవాడలో బిజెపి సీమాంధ్ర జిల్లాల కార్యవర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం నాలుగో కృష్ణుడికి కాంగ్రెస్ మేకప్ వేస్తోందని ఎద్దేవా చేశారు. ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్యాకప్ తప్పదన్నారు.
టిడిపిలోకి విజయనగరం సిటీ కేబుల్ ఎండి
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో సిటీ కేబుల్ ఎండి జి శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు అశోక గజపతి రాజు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీనివాస రావు తన ఇంటి నుండి అశోక్ బాబు బంగ్లా వరకు ర్యాలీగా వచ్చి టిడిపిలో చేరారు. సిటీ కేబుల్ ఆపరేటర్లు కూడా పచ్చ జెండా కప్పుకున్నారు. బొత్సకు చెందిన సత్య నెట్ వర్క్ తిరుగులేనిదిగా ఉంది.
సీమాంధ్ర విద్యార్థులతో కిరణ్ భేటీ
కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీమాంధ్రకు చెందిన విద్యార్ధి సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. సీమాంధ్రలోని మెత్తం 13 జిల్లాలకు సంబంధించి విద్యార్ధి ఐకాస నాయకులతో కిరణ్ మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి కిరణ్ రాష్ట్రంలో పలువురు నేతలతో బిజీబిజీగా మంతనాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కొత్త పార్టీ పెట్టే అలోచనలో ఉన్న ఆయన ఇప్పటికే పలుమార్లు తన సన్నిహితులతో, రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. అందులో భాగంగానే బుధవారం విద్యార్ధి సంఘాలతో ఆయన చర్చలు జరిపారు. కొత్త పార్టీ నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్ధి సంఘాలను కలుపుకుపోవడాని కిరణ్ భావిస్తున్నారు.
కాగా, విభజన బిల్లును దొంగచాటుగా ఆమోదించారని, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుదామని సీమాంధ్ర విద్యార్థులతో కిరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీమాంధ్రకు అన్యాయం
విభజనతో సీమాంధ్రకు అన్యాయమే జరిగిందని టిడిపి శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు తునిలో అన్నారు. జనాభా ప్రాతిపదికన అప్పులు పంచిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, సీమాంధ్రకు ఆస్తులు సరిగా పంచలేదని అరోపించారు. సీమాంధ్ర ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని జైరాం రమేష్ చెప్పడం హస్యాస్పదం అని అన్నారు.