బహుముఖ ప్రజ్ఞాశాలి.. రావి కొండలరావు మృతిపై కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం
ప్రముఖ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రావి కొండలరావు నాటి తరం ఉత్తమ నటుల్లో ఒకరని తెలంగాణ సీఎం కేసీఆర్ కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొంటూ మంగళవారం రాత్రి ఓ ప్రకటన చేశారు.
''బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడుగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.'' అని ఏపీ సీఎం కార్యాలయం తెలిపింది.

''సీనియర్ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాప్రపూర్ణ రావి కొండలరావు గారి మరణం విచారకరం. తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో, హాస్యాన్ని జోడించి ఆయన ప్రదర్శించే నటన ఆహ్లాదకరంగా ఉండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను'' అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు రావి కొండలరావు (88) మంగళవారం హైదరాబాద్లోని వివేకానంద ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. సినీ, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి నిరాడంబరంగా జీవితం గడిపిన రావి కొండలరావు మృతితో టాలీవుడ్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications