జగన్పై విహెచ్ ఫైర్, స్మాల్బాయ్ ఏమంటామని కెసిఆర్
నల్గొండ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోగేసుకున్నది చాలని ఇంకేం దోచుకుందామని సమైక్యాంధ్ర అంటున్నావన్నారు. విహెచ్ 'సోనియా కృతజ్ఞతా యాత్ర' నల్గొండలో కొనసాగుతోంది. వైయస్ కుటుంబ చరిత్ర చూసి పిసిసి పదవి ఇవ్వవద్దని ముప్పై మంది ఎంపీలు ఫిర్యాదు చేసినా.. తానే ఇప్పించానని విహెచ్ అన్నారు.
ఆ తర్వాత తననే లక్ష్యంగా చేసుకొని కృతజ్ఞత లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. 2003లో వైయస్ తన సొంత ఇంటి మరమ్మతులు నిర్వహించుకోలేని స్థాయి నుండి.. ఇప్పుడు జగన్ లక్షల కోట్లు దండుకొని దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తుల్లో మూడోవాడిగా నిలిచాడని, తండ్రి మృతదేహం పక్కనుండగానే పదవి కోసం ఆరాటపడిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తున్నామని చెప్పి, ఆ తర్వాత సమన్యాయం అని ఇప్పుడు సమైక్యవాదాన్ని జగన్ వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ విజయమ్మ రాష్ట్రంలో తిరిగి సోనియా తన భర్తను చంపారన్న మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. తెలంగాణ వచ్చే సమయంలో కిరణ్, జగన్, చంద్రబాబులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సొంత పార్టీ పెడితే కిరణ్ సత్తా తెలుస్తుందన్నారు.
జగన్ స్మాల్ బాయ్: కెసిఆర్
'జగన్ స్మాల్ బాయ్, మా అబ్బాయి వయసు. అతను మాట్లాడిన దానిపై ఏం స్పందిస్తామని' తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన విలేఖరుల సమావేశంలో జగన్ గురించి విలేఖరులు ప్రస్తావిస్తూ రాయల సీమలోని రెండు జిల్లాలే కాదు మొత్తం రాష్ట్రాన్ని కలిపి తెలంగాణ అని పేరు పెట్టండి అని జగన్ సూచించిన విషయాన్ని ప్రస్తావించగా, ఆయన మాటలు హాస్యాస్పందంగా ఉన్నాయన్నారు. స్మాల్ బాయ్, ఏం మాట్లాడతామన్నారు.












Click it and Unblock the Notifications