video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్
మరో నాలుగు రోజుల్లో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, ఓ వీడియో లీక్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్నది. ఏపీ టీడీపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడుకు సంబంధించిన ఆ వీడియోలో టీడీపీ భవిష్యత్తుకు సంబంధించి సంచలన కామెంట్లు వినిపించగా, సదరు సంభాషణను వక్రీకరించారంటూ ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. వీడియో లీక్ ను జగన్ విష పన్నాగంగా అచ్చెన్న అభివర్ణించారు..

అసలేం జరిగిందంటే..
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తన కారవాన్ లో టిఫిన్ చేస్తూ మాట్లాడిన దృశ్యాల తాలూకు వీడియో ఒకటి మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే అది వైరలైంది. అచ్చెన్నతో మాట్లాడిన ఓ అదృశ్య వ్యక్తి తన దగ్గరున్న కెమెరాతో నేతకు తెలియకుండా సంభాషణను రికార్డు చేసినట్లుంది. టీడీపీ ప్రస్తుత పరిస్థితి, పార్టీకి భావి నాయకుడిగా భావిస్తోన్న నారా లోకేశ్ తీరుపై అచ్చెన్న అనూహ్య వ్యాఖ్యలు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే అచ్చెన్నతో సంభాషించిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరనేది ఇంకా బయటికి రాలేదు. ఈలోపే వీడియో క్లిప్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయగా, వాటికి అచ్చెన్న ఘాటు కౌంటరిచ్చారు.

ఇంతకీ అచ్చెన్న ఏమన్నారంటే..
''పోలింగ్ 17న అయిపోతే అందరం ఫ్రీ అయిపోతాం. పార్టీ లేదు.. బొక్కా లేదు. (మీరేమన్నా అనుకోండి సార్. పార్టీ పని అయిపోయిందని అదృశ్య వ్యక్తి అచ్చెన్నతో అంటారు) ఫీల్ అయితే మనకేముంది. ఫస్ట్ నుంచి ఓ పట్టు పట్టుకున్నాం కాబట్టి అలా వెళుతుంది. లోకేశే బాగుంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొస్తుంది'' అని అచ్చెన్న అన్నట్లుగా వీడియోలో రికార్డయింది. అంతేకాదు..

డబ్బుల సెటిల్మెంట్ ప్రస్తావన..
లీకైన వీడియోలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడుతో మాట్లాడిన అదృశ్య వ్యక్తి సైతం నారా లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పుడు అన్నా అని పిలిచిన లోకేశ్ ఇప్పుడు ఏమ్మా అని అంటున్నాడని, ఇటీవల విజయవా డలో పార్టీ ఆఫీస్లో కలిస్తే పట్టించుకోలేదని, కేఎల్ నారాయణ అనే వ్యక్తి నుంచి రూ.6 కోట్లు రావాల్సి ఉండగా, కనీసం రూ.3కోట్లయినా ఇప్పించాలని ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటని, టీడీపీ పని అయిపోయిందని సదరు అదృశ్య వ్యక్తి అచ్చెన్నతో మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. కాగా,

అచ్చెన్న వివరణ.. అదృశ్య వ్యక్తి ఎవరు?
ఏపీలో సంచలనంగా మారిన వీడియో క్లిప్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. వీడియోను రికార్డు చేసిన అదృశ్య వ్యక్తి ఎవరేనది స్పష్టం చేయకుండానే, సదరు సంభాషణలను వక్రీకరించారని అచ్చెన్న వాపోయారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన సభపై రాళ్లు వేయించిన వైసీపీ నేతలే.. ఇవాళ తన సంభాషనల్ని వక్రీకరించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తిరుపతిలో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దిగజారుడు కార్యక్రమాలకు పూనుకున్నారని విమర్శించారు. లోకేశ్ నాయకత్వం వల్లే పార్టీ దుస్థితికి చేరిందంటూ వీడియోలో అచ్చెన్న చేసినట్లుగా చెబుతోన్న వ్యాఖ్యలపై అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులు వేలకొద్దీ కామెంట్లు పెడుతున్న క్రమంలో..

లోకేశ్తో నన్ను విడదీయలేరు..
వీడియో లీవ్ వ్యవహారంలో సంభాషణలను వక్రీకరించారన్న అచ్చెన్నాయుడు.. దీన్ని సీఎం వైఎస్ జగన్, వైసీపీ కుట్రగా అభివర్ణించారు. ''జగన్ రెడ్డి.. నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టిడిపిలో విభేదాలు సృష్టించలేరు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేశ్ విసిరిన సవాల్కి తోకముడిచావు. నిన్న బాబుగారి సభపై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు. నారా లోకేశ్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications