బాబు గిన్నిస్కెక్కుతారు, రాజధాని ముడుపులతో సింగపూర్లో మరో హోటల్: విజయసాయి
గుంటూరు: ప్రజలను మభ్యపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిన్నిస్ రికార్డులకు ఎక్కుతారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి విజయ సాయి రెడ్డి సోమవారం నాడు గుంటూరు జిల్లాలో ఎద్దేవా చేశారు.
ఏపీలో చంద్రబాబు ఏడాది పాలన పూర్తి వైఫల్యాలతో కూడుకున్నదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారం చేపట్టాక చేసిన తొలి ఐదు సంతకాలను అమలు చేయలేదన్నారు. వాటిని అభాసుపాలు చేశారన్నారు.
రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను ఇలా అందర్నీ మభ్యపెట్టారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరదీక్ష చేపడుతోందని చెప్పారు.
రాజధాని మాస్టర్ ప్లాన్ ఒప్పందం ద్వారా వచ్చిన ముడుపులతో ఆయన సింగపూర్లో మరో హోటల్ నిర్మించుకుంటారని ఆరోపించారు. పోలీసులను ప్రయోగించి ప్రతిపక్షాన్ని ఎలా అణగదొక్కాలో మినీ మహానాడులో చర్చించుకోవడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వేరుగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన విద్యార్థి జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆయన మాట్లాడారు. తమ ఇద్దరు కేంద్రమంత్రులను టీడీపీ వెనక్కి పిలిపిస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు.