వంశీ భవితవ్యం తేల్చబోతున్న విజయవాడ కోర్టు..! రెండు తీర్పులు..!
ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వంశీ దాఖలు చేసుకున్న ఓ పిటిషన్ తో పాటు పోలీసులు దాఖలు చేసిన మరో పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం కీలక నిర్ణయాలు వెలువరించబోతోంది. ఈ రెండు పిటిషన్లలో కోర్టు ఇచ్చే తీర్పులు వంశీ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి వ్యవహారంలో ఫిర్యాదుదారుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసిన కేసులో వంశీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని వంశీ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో సత్యవర్ధన్ ను ఆయన తీసుకెళ్తున్న ఫుటేజ్ కూడా బయటికి రావడంతో నిన్న హైకోర్టు కూడా వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో మరో రెండు అంశాలపై విజయవాడ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది.

ఫిర్యాదుదారును బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసిన వ్యవహారంలో వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలంటూ పోలీసులు కస్టడీ కోరుతున్నారు. దీంతో విజయవాడ కోర్టు వంశీతో పాటు ఇదే కేసులో మరో ఇద్దరి కస్టడీపైనా ఇవాళ తన నిర్ణయం చెప్పబోతోంది. అలాగే రిమాండ్ పై విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీ తనకు అదనపు వసతులు కావాలని కోరుతున్నారు. తన ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా ఈ వసతులు కావాలని కోరుతున్నారు. దీంతో వంశీ ఆరోగ్య పరిస్ధితిపై కోర్టు రిపోర్టు కోరింది. దీని ఆధారంగా కోర్టు వంశీకి జైల్లో వసతులపైనా తీర్పు ఇవ్వబోతోంది.












Click it and Unblock the Notifications