అమెరికా ఎన్నికల్లో తెలుగమ్మాయి: ఎంపీ కేశినేని కుమార్తెకు అరుదైన ఛాన్స్
అమరావతి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింట్ తరుపున ఓ తెలుగు అమ్మాయి ప్రచారం చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ తరపున విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ద్వితీయ కుమార్తె శ్వేత ప్రచార బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఈ ఎన్నికల్లో శ్వేతని తన ప్రచార కార్యక్రమ బాధ్యతలు నిర్వర్తించే కోర్ టీమ్లో సభ్యురాలిగా హిల్లరీ క్లింటన్ చేర్చుకున్నారు. హిల్లరీ ప్రచార బాధ్యతలు నిర్వహించే కీలక బృందంలో సభ్యురాలుగా ఉన్న నాని కుమార్తె శ్వేత కొన్నేళ్లుగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయవాడలో నాని తరపున శ్వేత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా, అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమోక్రాట్ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్ పోటీ పడతుండగా రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్లు ముందు వరుసలో ఉన్నారు.

ఇరు పార్టీల ‘సూపర్ ట్యూస్డే' ప్రైమరీల్లో వారిద్దరూ తమ తమ పార్టీల్లో భారీ విజయాలు సాధించారు. అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పార్టీ నామినేషన్లు పొందేందుకు తమ తమ పార్టీల్లో ప్రత్యర్థులకన్నా చాలా ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం నాడు జరిగిన ఈ ప్రైమరీల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.
రిపబ్లికన్ పార్టీ నామినేషన్ రేసులో ముందున్న ట్రంప్.. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెన్నెసీ, వెర్మాంట్, వర్జీనియా ఇలా ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. డెమోక్రాట్ పార్టీ నామినేషన్ రేసులో ముందున్న హిల్లరీ.. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెన్నెసీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో విజయం సాధించారు.
ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్ల నుంచి హిల్లరీకి గట్టి మద్దతు లభించింది. రిపబ్లికన్ పార్టీలో టెడ్ క్రూజ్.. టెక్సాస్లో అతిపెద్ద విజయం సాధించటంతో పాటు, ఓక్లహామా, అలాస్కాల్లోనూ గెలుపొందారు. డెమోక్రాట్ పార్టీ నుంచి కూడా.. హిల్లరీ ప్రధాన ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందారు.
అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రచార పర్యంలో పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే... అమెరికాలోని అక్రమ వలసదారులంతా వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి అమెరికాలోని భారతీయులపై కూడా ఆయన ప్రస్తావించారు.
అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన 3 లక్షల మంది భారతీయులు సహా 1.10 కోట్ల మంది విదేశీయులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లి పోవాలన్నారు. అమెరికాలోకి మళ్లీ తిరిగి సుదీర్ఘమైన చట్టబద్ధ ప్రక్రియ ద్వారా రావాలన్నారు. తాజా వ్యాఖ్యలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది.
దీంతో పాటు హెచ్-1బి వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతుందంటూ అమెరికా సెనేటర్లు శుక్రవారం గళమెత్తారు. హెచ్-1బి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్న సంస్ధలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications