నవ్యాంధ్ర రాజధానిపై డ్రగ్స్ మాఫియా కన్ను...విజయవాడలో పట్టుబడ్డ కొకైన్,హెరాయిన్:ఇదే తొలిసారి
విజయవాడ:మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకున్న డ్రగ్స్ మాఫియా తమ వికృత వ్యాపారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ మారుమూల నగరాలకూ విస్తరిస్తోంది.
అందుకు ప్రబల సాక్ష్యంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో విజయవాడలో తొలిసారిగా పట్టుబడ్డ హై రేంజ్ డ్రగ్స్ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎపి పోలీసు రికార్డుల్లోని డ్రగ్స్ జాబితాలోకి గంజాయి, బ్రౌన్ షుగర్ వంటివే తప్ప...కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు ఎప్పుడూ ఎక్కలేదు. అలాంటిది నవ్యాంధ్ర చరిత్రలో తొలిసారిగా విజయవాడలో ఈ టాప్ రేంజ్ డ్రగ్స్ తో పాటు వాటిని సరఫరా చేస్తున్న ముఠా కూడా పోలీసులకు చిక్కింది.
విజయవాడకు...విస్తరణ
ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా తమ వ్యాపారాన్ని నవ్యాంధ్రకి కూడా విస్తరించినట్లేనా అంటే...తాజాగా విజయవాడలో పట్టుబడిన డ్రగ్స్ ని చూసి ఔననే సమాధానం చెప్పుకోకతప్పదు. కొకైన్, హెరాయిన్ మాదకద్రవ్యాలతో ఏడుగురు సభ్యుల ముఠా విజయవాడలో శనివారం పట్టుబడింది. విజయవాడలో తమ డ్రగ్స్ బిజినెస్ ని డెవలప్ చేసేందుకే ఈ ముఠా ఇక్కడ కాలు పెట్టినట్లు ప్రాధమిక సమాచారంగా తెలుస్తోంది. తమ డ్రగ్స్ బిజినెస్ విస్తరణ కోసం ప్రత్యేకంగా ఒక కారులో బయలు దేరి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఈ ముఠా ఆ తరువాత ముఠా రెండు జట్లుగా విడిపోయింది.
ఇక్కడ...ఇదే తొలిసారి
ఒక బృందం అజిత్సింగ్నగర్ రాగా మరొకటి ప్రకాశం బ్యారేజీ పరిసరాలకు చేరుకొంది. అజిత్సింగ్నగర్ ముఠా సభ్యులు తొలుత పోలీసులకు పట్టుబడి వారిచ్చిన సమాచారంతో రెండో బృందాన్ని పట్టుకున్నారు. ఆ తరువాత వీరి వద్ద లభించిన తెల్లని పౌడర్లను తనిఖీ చేశారు. ఆ తరువాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సహకారంతో తెచ్చిన ప్రత్యేకమైన కిట్తో పౌడర్లను పరీక్షించగా అవి కొకైన్, హెరాయిన్లని తేలింది. అయితే వీరి నుంచి కేవలం 4 గ్రాముల కొకైన్, 10 గ్రాముల హెరాయిన్ మాత్రమే దొరికినప్పటికీ...అసలు విజయవాడలో ఈ మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇటు బెజవాడవాసులనే కాదు అటు పోలీసులకు ఉలికిపాటుకు గురి చేసింది.
అందుకే...రాక
దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. వీరి నుంచి పది సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో తమ టెర్మ్స్ అండ్ కండిషన్ కు అనుకూలంగా ఉండే నయా డ్రగ్ డీలర్లను సెలక్ట్ చేసుకునేందుకే ఈ ముఠా విజయవాడకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిందట. అయితే ఈ ముఠా కదలికలపై పోలీసులకు ముందుగానే స్పష్టమైన సమాచారం రావటంతో పోలీసులు అనూహ్యమైన దాడులు జరిపి మొత్తం ఏడుగురు ముఠా సభ్యులను పట్టుకున్నారు. అయితే పోలీసులకు చిక్కిన ముఠాలో ఇద్దరు బంగ్లాదేశీయులతో పాటు మిగిలిన వారంతా ఉత్తరాది వారే ఉండటం, వీరు ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడపై కన్నేయటం కలకలం రేపుతోంది.
వెంటనే...సమాచారం ఇవ్వండి
ఇదిలావుంటే ఈ ఫోన్ల నుంచి వీరు స్థానికంగా ఉండే కొందరికి ఫోన్లు చేసినట్లు తెలిసింది. వారెవరనే దిశలో కూడా దర్యాప్తు ప్రారంభమైంది. వారి వివరాలు కూడా తెలిస్తే విజయవాడకు...జాతీయముఠాతో ఉన్న సంబంధాలలో ఒక లింక్ బైటపడుతుందని పోలీసులు అంటున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా మారిన తరువాత విజయవాడపై కూడా మాదక ద్రవ్యాల ముఠా కన్నేసిందని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని మొగ్గ దశలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇలాంటి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని... డయల్ 100 లేదా 08662579999 లేదా 08662576956 లేదా 7328909090 (పోలీస్ వాట్సాప్ నెంబరు)కు సమాచారం అందిస్తే సంఘ విద్రోహశక్తుల ఆట కట్టిస్తామని పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.