Viral Video : గణేశ్ ఆంక్షలు-జగన్ సర్కార్ పై వినాయకుడికి యువకుడి ఫిర్యాదు
కేంద్రం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న వినాయక చవితి ఆంక్షల నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది. ఈ విషయాన్ని బీజేపీ, టీడీపీ సహా విపక్ష పార్టీలన్నీ తప్పుబడుతుండటంతో జగన్ సర్కార్ ఆత్మరక్షణలో పడుతోంది. అయితే ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే కేసులు తప్పవని ఇవాళ విపక్షాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణాజిల్లాలో జరిగిన ఓ ఘటన సంచలనం రేపింది.
ఏపీలో కరోనా పేరుతో వినాయక చవితి ఊరేగింపులు, భారీ విగ్రహాలపై ఆంక్షలు విధించడాన్ని తప్పుబడుతూ కృష్ణాజిల్లాలో ఓ యువకుడి విన్నూత కార్యక్రమం చేపట్టాడు. ఏకంగా గణేశ్ విగ్రహానికి మొరపెట్టుకున్నాడు. ఈ మొరను వినాయకుడి ఆలకించాడో లేదో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఇది వైరల్ గా మారిపోయింది. దీన్ని చూసి వారంతా స్నేహితులు, బంధువులందరికీ షేర్లు కొడుతున్నారు. దీంతో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కూడా ఆసక్తికరంగా మారింది.
కరోనా కారణంగా రెండేళ్లుగా నీ పండుగ చేయలేకపోయాం... ఇకపైన కూడా ఏపీలో చేయలేమంటూ వినాయక విగ్రహానికి సదరు యువకుడు తన ఆవేదన వెళ్లగక్కాడు. వినాయకుడి బొమ్మల తయారీ కేంద్రానికి వెళ్లి ఓ విగ్రహంతో మాట్లాడుతూ సజ్జా అజయ్ అనే యువకుడు ఈ వీడియోను తీసుకున్నాడు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని పండుగలకు, మీటింగ్ లకు సినిమా హళ్ళ కు అన్నింటికీ అనుమతినిచ్చి, వినాయక మండపాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ సూటి ప్రశ్న సంధించాడు. దీంతో ఇప్పుడు ఈ ప్రశ్నలపై చర్చ జరుగుతోంది.
అసలే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న వైసీపీ సర్కార్ విపక్షాలకు టార్గెట్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో సాధారణ ప్రజలు సైతం ఇలా వినాయక చవితి ఆంక్షల్ని చర్చనీయాంశంగా మార్చడం ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. అయితే వైసీపీ సర్కార్ మాత్రం పండుగల సీజన్ లో కేంద్రం విధించిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేసేందుకే మొగ్గుచూపుతోంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కరోనా ధర్డ్ వేవ్ ముప్పు తప్పదన్న హెచ్చరికల్ని గుర్తు చేస్తోంది.