విశాఖ ఎక్స్ప్రెస్లో దోపిడీ...రైలుపై రాళ్లదాడి: పార్థీగ్యాంగ్ పనిగా అనుమానం
పశ్చిమ గోదావరి: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న విశాఖ ఎక్స్ప్రెస్ లో దోపిడీ కలకలం రేపుతోంది. దొంగలు చైను లాగి రైలును ఆపి ప్రయాణికుల మెడల్లోని బంగారు ఆభరణాలను దోచుకోవడమే కాకుండా అడ్డుకోబోయిన వారిపై రాళ్లతో దాడి చేయడం సంచలనం సృష్టించింది. దోపిడీ జరిగిన తీరును బట్టి ఇది పార్థీ గ్యాంగ్ పనేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్టేషన్ దాటిన తర్వాత కాల్దరి గ్రామ సమీపానికి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు చైను లాగడంతో రైలు ఆగిపోయింది. అర్థరాత్రి సమయం కావడంతో బోగీల్లో అందరూ లైట్లు ఆపి గాఢ నిద్రలో ఉన్నారు. రైలు ఆగడంతోనే బోగీలకు ఇరువైపుల చీకట్లోనే కొందరు వ్యక్తులు బయటి నుంచే కిటికీల పక్కనున్న ప్రయాణికుల మెడల్లోని ఆభరణాలను గుంజుకోవడం చేశారు.
ఈ విధంగా ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-10, ఎస్-12, ఎస్-14 బోగీల్లోని పలువురు ప్రయాణికులు ఈ దొంగల బారి పడ్డారు. చిమ్మ చీకట్లో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులకు మొదట ఏం జరుగుతుందో అర్థంకాలేదు, ఆ తరువాత విషయం అర్థం చేసుకున్న ప్రయాణికులు కొందరు బోగీల డోర్లు తీసి సెల్ఫోన్ల లైట్లు వేసి బయటి నుంచి ఇలా దోపిడీకి పాల్పడుతున్నవ్యక్తులను చూసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం గమనించిన ఆ దొంగలు పట్టాలపై ఉన్న కంకర రాళ్లతో డోర్లపై దాడి చేయడంతో భయపడిన ప్రయాణికులు ఆ ప్రయత్నం మానివేశారు. ఈ లోపు వీలైనంతమంది ప్రయాణికులను దోచుకున్న దొంగలు ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు.
విశాఖ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తూ ఈ దొంగల బారిన పడిన అన్నవరానికి చెందిన చేబ్రోలు కృష్ణమోహన్, జయలక్ష్మి దంపతులు, ఖరగ్పూర్కు చెందిన పద్మలక్ష్మి అనంతరం భీమవరం జీఆర్పీ పోలీస్ స్టేషన్లో దోపిడీ విషయమై ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 382 ప్రకారం తీవ్ర దోపిడీ కింద జిఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారుగా 10 నుంచి 12 మంది ప్రయాణికుల నుంచి ఇలా 100 గ్రాముల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్టు పోలీసులకు తెలిసింది. అయితే కొందరు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రానట్లు తెలిసింది. మరోవైపు ఈ దోపిడీ ఒక పథకం ప్రకారం జరిగినట్లుగా భావించిన పోలీసులు దొంగతనం జిరిగిన తీరును బట్టి ఇది పార్థివ్ గ్యాంగ్ పని అయి ఉండవచ్చని అనుమానిస్తునారు.