తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!!
Visakhapatnam Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము, బొగ్గు సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడ్డాయి.
ఉద్యోగుల తరలింపు సైతం ముమ్మరం అయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో శాశ్వత ప్రాతిపదికన పని చేస్తోన్న వారిలో వంద మందిని డెప్యుటేషన్ మీద పంపించనుంది కేంద్రం. వారందరినీ కూడా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సర్దుబాటు చేయనున్నారు. అదే సమయంలో 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులనూ తొలగించినట్లు వార్తలొచ్చాయి.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ వచ్చింది.
ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన తలపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనుంది కేంద్రం.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో- ప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మల కీలక డిమాండ్ను ఆయన ముందు ఉంచారు. విశాఖ స్టీల్ పరిరక్షణపై గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా 2021లో చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన లేఖను ఆయనకు పంపించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని, అవసరమైతే తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు కూడా చేస్తారంటూ అప్పట్లో ఈ లేఖలో పొందుపరిచారు చంద్రబాబు. ఇప్పుడు అదే అంశాన్ని వైఎస్ షర్మిల తెరమీదికి తీసుకొచ్చారు. మాట మీద నిలబడే తత్వం ఉంటే, అప్పట్లో ఇచ్చిన ఈ లేఖకు విలువ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లను నిలదీయాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆంధ్రుల హక్కు ముఖ్యమా? లేక బీజేపీతో పొత్తు ముఖ్యమా? విశాఖ ఉక్కు ముఖ్యమా? లేక ఎన్డీఏలో పదవులు ముఖ్యమా?, మాట మీద నిలబడే సిఎం అవుతారా?, లేక మోసగాడుగా ముద్ర వేసుకుంటారా? తేల్చుకోవాలని అన్నారు.
విజయదశమి కానుకగా విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయనున్నట్లు,14,000 మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించనున్నట్లు, భూములు కోల్పోయిన 8,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు, 23,000 ఎకరాల్లో ఒక్కటి కూడా అమ్మేది లేనట్లు కేంద్రంతో అధికారిక ప్రకటన చేయించాలని, అలాంటి డిమాండ్ ఏదీ రాకపోతే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని షర్మిల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications