'వైఎస్ కు ఎక్కడ పేరొస్తుందోననే..! చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు'
అనంతపురం : అధికారంలో ఉన్న నేతలు అభివృద్దిని కాంక్షించడం పరిపాటి. అలా కాకుండా రాజకీయ వివక్షను అభివృద్దికి ఆపాదించి స్వార్థపూరితంగా వ్యవహరిస్తే..! ఏపీ సీఎం చంద్రబాబు తీరు ఇలాగే ఉందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.
తాజాగా కృష్ణా పుష్కరాల సందర్బంగా.. అనంతరపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ లో పుష్కర స్నానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందో అన్న ఉద్దేశంతో చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆరోపించారు. పుష్కర స్నానం అనంతరం పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి.. చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని భగవంతుడిని కోరినట్లు తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు కృష్ణా నీటిని తీసుకొచ్చిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ప్రతీ ఏటా 15 టీఎంసీల కృష్ణా జలాలు వస్తున్నా..! ఒక్క ఎకరాకు కూడా నీరందించిన పరిస్థితి లేదని చంద్రబాబుపై మండిపడ్డారు. డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని చంద్రబాబు సర్కార్ ను విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.