పులివెందులలో ఏం జరుగుతోంది?
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ప్రస్తుతం క్షణక్షణం .. భయం భయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజుకు సరిగ్గా 15 రోజుల ముందు అతని పెంపుడు కుక్కను చంపేశారు. ఆ తర్వాత వివేకా హత్యకు గురయ్యారు. సరిగ్గా దస్తగిరికి కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.
కీలక సాక్షులకు బెదిరింపు కాల్స్!
వివేకా హత్య కేసులో సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సీబీఐ అధికారులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వివేకా పెంపుడు కుక్కను ఇంటి ఆవరణలోనే కారుతో ఢీకొట్టి చంపేశారని సీబీఐ తన నివేదికలో వెల్లడించింది. హత్య చేయడానికి కుక్క అడ్డుగా ఉంటుందనే కారణంతోనే చంపేశారని సీబీఐ పేర్కొంది. కేసు కీలక దశకు చేరిన తరుణంలో అప్రూవర్ గా మారిన దస్తగిరి సాక్ష్యంతో కీలక నిందితులను పట్టుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు, కీలక సాక్షులకు ప్రధాన నిందితుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి.
పెంపుడు కుక్క చనిపోయింది!!
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరు మండల వైసీపీ నాయకుల నుంచి దస్తగిరికి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇద్దరు గన్మెన్ను అతనికి రక్షణగా నియమించారు. నాలుగు నెలల క్రితం ఓ కుక్కను కొని పెంచుకుంటుండగా వారం రోజుల క్రితం అది చనిపోయింది. ఆ తర్వాతరోజు ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో దస్తగిరి ఇంటికి వచ్చి కుక్కను కొంటామని అడిగారు. అయితే దస్తగిరి దంపతలు ఇంట్లో లేకపోవడంతో పక్కింటివారిని అడిగి తెలుసుకున్నారు. కుక్క చనిపోయిందని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఇదంతా గమనించిన దస్తగిరి భార్య షబనా తమపై కుట్ర జరుగుతోందంటూ మీడియాకు తెలిపరు. రక్షణ కల్పించాని కోరారు..
సమాచారం లేకుండానే గన్ మెన్ల మార్పిడి?
సరిగ్గా దస్తగిరి కుక్క చనిపోయి తర్వాతరోజే అతనికి రక్షణగా ఉన్న గన్ మెన్లను పోలీసు అధికారులు మార్చేశారు. కొత్తవారిని నియమించగా వారి కదలికలపై అతను అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సీబీఐ అధికారులకు, కడప ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాడు. ముందుగా ఎటువంటి సమాచారం లేకుండా గన్ మెన్లను ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నాడు. తన ప్రాణాలకు ఏదైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నాడు. రెండురోజుల తర్వాత మళ్లీ ఎస్పీ కార్యాలయానికి వచ్చి ముప్పుందంటూ భయాందోళనలు వ్యక్తం చేశాడు.
ఎస్పీ చెబుతున్నది అర్థరహితం?
దస్తగిరి వాదనను ఎస్పీ అన్బురాజన్ ఖండించారు. పరిపాలనా పరమైన అంశంలో భాగంగానే వారిని మార్చామని, గతంలో తొండూరు పోలీస్ స్టేషన్ లో ఇతర వ్యక్తులు, దస్తగిరి మధ్య ఘర్షణ జరిగినా గన్ మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని,అందుకే వారిని తొలగించామన్నారు.
మే నెలలో సంఘటన జరిగితే అక్టోబరులో తొలగించామని చెప్పడంపై దస్తగిరి దంపతులు ఆందోళన చెందుతున్నారు. సీబీఐ అధికారులను కూడా ఫిర్యాదు చేయడంతోపాటు వివేకా హత్యకు సంబంధించిన పలు విషయాలను వారికి కూలంకుషంగా తెలియజేసినట్లు సమాచారం. తర్వత ఎస్పీకి కూడా దస్తగిరి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.