దేవుడు పోలీసైనా న్యాయం చేయలేడు: పోలీస్అధికారి
కర్నూలు: ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థలో నిజాయితీ, నిష్పక్షపాతంగా పని చేయడం కష్ట సాధ్యమని, ఇప్పటి పరిస్థితుల్లో భగవంతుడు పోలీసు అయినా ప్రజలకు పూర్తి న్యాయం చేయలేడని ఆంధ్రప్రదేశ్ అదనపు డీజీపీ, జైళ్ల శాఖ విభాగాధిపతి వీకే సింగ్ ఆదివారం అన్నారు.
'ఇదా మన పోలీసు వ్యవస్థ' అనే పుస్తకాన్ని ఆయన రచించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను బీహార్వాసిని అని, సామాజిక సేవకుడు, అధ్యాపకుడు అయిన తన తండ్రి పైన పోలీసులు అక్రమ కేసు బనాయించి అన్యాయం చేశారన్నారు.
ఆ కసితోనే పోలీసు శాఖలో మార్పు తీసుకు వచ్చేందుకు, బాధితులకు న్యాయం చేసేందుకు పట్టుదలతో చదివి ఐపీఎస్ సాధించానని చెప్పారు. ప్రస్తుత పోలీసు వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయలేదన్నారు.
రాజకీయ నేతలు, డబ్బు, పరపతి ఉన్న వాళ్లకే పోలీసు వ్యవస్థ ఉపయోగపడుతోందనే సంగతిని గుర్తించానని వ్యాఖ్యానించారు. జైళ్లలో ఉంటున్న తొంబై శాతం మంది పేదలేనని, డబ్బున్న నేరస్తులు బయట తిరుగుతున్నారన్నారు.