అంతా బీజేపీ నాటకం, బయటకు వచ్చామనే: ఏపీ అసెంబ్లీలో నేతల మాటల యుద్ధం
అమరావతి: ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిన తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. అవినీతి ఆరోపణలు చేసింది. పట్టిసీమలో భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ సభ్యులు బుధవారం ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు.
'టీడీపీ వల్లే మోడీ ప్రధాని, వైయస్ చీల్చమన్నారు.. మోడీ వస్తారని ఊహించలేదు'
రూ.371 కోట్లు దుర్వినియోగం అయినట్లుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నిధులు వృతా చేశారన్నారు. రూ.190 కోట్లు వృథాగా ఖర్చు పెట్టారని కాగ్ ఆరోపించిందని అన్నారు. దీనిపై టీడీపీ ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నాలు చేసింది.
వైసీపీ స్క్రిప్ట్ బీజేపీ చదువుతోంది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ను బీజేపీ సభ్యులు చదువుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బీజేపీ, వైసీపీలు కలిసి కుట్రతో దాడి చేస్తున్నాయన్నారు. బడ్జెట్ పైన మాట్లాడే ధైర్యం లేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అప్పుడు బీజేపీ సభ్యులు మంత్రిగా ఉన్నారని చెప్పారు. కేబినెట్ నుంచి బయటకు వచ్చాక అవినీతి కనిపించిందా అన్నారు.
అంతా నాటకం
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పట్టిసీమపై బీజేపీ నేతలు గతంలో ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. వైసీపీ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా.. ఇదంతా నాటకం అన్నారు. మొదట జగన్, తర్వాత పవన్, ఇప్పుడు బీజేపీ మాట్లాడుతున్నాయన్నారు. నిన్నటి వరకు పొగిడి ఇప్పుడు విమర్శలు చేస్తారా అన్నారు.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చినందుకు
ఇదంతా బీజేపీ డ్రామా అని అచ్చెన్నాయుడు అన్నారు. మొదట జగన్తో మాట్లాడించారని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో మాట్లాడించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినందునే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ చవకబారు విమర్శలు చేస్తోందన్నారు.
పట్టిసీమను వ్యతిరేకించలేదు
ఆ తర్వాత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. పట్టిసీమను తాను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఇవినీతి అంటూ కాగ్ రిపోర్టు వచ్చింది కాబట్టి నిలదీస్తున్నామన్నారు. తాము ఆధారాలు లేకుండా ఎవరి పైనా అవినీతి ఆరోపణలు చేయమని తెలిపారు. తాము ఇప్పటికీ చెబుతున్నామని, పట్టిసీమ వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని ఇప్పుడు అదే చెబుతున్నామని, కానీ ఆర్థిక అవకతవకలు జరిగాయని చెబుతున్నామన్నారు.