రాజకీయనిర్ణయమంటే బిజెపితో తెగదెంపులంటున్నారు: బాబు
హైదరాబాద్: విభజనపై రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లే, ప్రత్యేక హోదాపైనా కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నది తమ వాదన అని, ఆ బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీపై ఉందని, తాను దీని గురించి మాట్లాడితే రాజకీయ నిర్ణయం అంటే బీజేపీతో తెగతెంపులని కొందరు అనుకొంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
పక్క రాష్ట్రాలతో పోటీపడగలిగే పరిస్థితి కల్పించాలనే తాము కేంద్రాన్ని కోరుతున్నామని, విభజన తర్వాత తమ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కేంద్రంలోని పెద్దలకు మరింతగా వివరిద్దామని, నచ్చచెబుదామని ఆయన అన్నారు. తమకు రావాల్సిన వాటిని సాధించుకుందామని, మన బాధ, ఆవేదన చెబుదాం తప్ప కేంద్రాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని, కేంద్రంతో ఘర్షణ అవసరం లేదని ఆయన తన మంత్రివర్గ సహచరులతో అన్నారు. కేంద్రంపై ఇప్పటికీ నమ్మకముందని తెలిపారు.
బుధవారం హైదరాబాద్లో సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. విభజన చట్టం, ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి, ఆర్థిక సంఘం నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ వంటివాటిని చంద్రబాబు మంత్రులకు వివరించారు. రాష్ట్ర విభజనను అశాస్త్రీయంగా చేయడం వల్లే ఆంధప్రప్రదేశ్కు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చిందని, రాష్ట్రం ఆర్థికంగా ఎలా నిలదొక్కుకొంటుందో ఆలోచించకుండా విభజన చేశాని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారులు అంటున్నారని, తాను తన బాధ, ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేసిన తర్వాత ఢిల్లీలో కొంత కదలిక వచ్చిందని, తనతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.
కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమా భారతి తనతో మాట్లాడారని, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో లోపం జరిగిందని, దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఆమె చెప్పారు. తన శాఖ బడ్జెట్ రూ.15 వేల కోట్ల నుంచి ఇప్పుడు కేవలం రూ. నాలుగు వేల కోట్లకు తగ్గిపోయిందని, దీనితో నామమాత్రంగా ప్రతి ప్రాజెక్టుకు రూ.వంద కోట్ల చొప్పున కేటాయించాల్సి వచ్చిందని ఆమె వివరించారని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తన భార్య చికిత్స కోసం అమెరికా వెళ్లారని, ఆయన ఢిల్లీకి రాగానే వెళ్లి కలుస్తానని చంద్రబాబు తెలిపారు. బడ్జెట్పై చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చే సమయంలో ఏదైనా చెబుతారేమో చూద్దామని కూడా చంద్రబాబు అన్నారు.
గత కొన్ని రోజులుగా కొందరు టీడీపీ నేతలు తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ ఆక్షేపించారు.బడ్జెట్లో మొండిచేయి చూపడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దానిని అర్థం చేసుకోవాలని కొందరు టీడీపీ మంత్రులు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవడంలో తమ మద్దతు కూడా ఉంటుంది. మీ వెంట ఢిల్లీ రమ్మన్నా వస్తామని బిజెపికి చెందిన మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.
తెలంగాణతో ఉన్న వివాదాలు, సమస్యలపై ఒకేసారి కూర్చుని చర్చించాలన్నది తన ప్రతిపాదన అని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ అంశంపైనే కాక అన్ని అంశాలపై ఒకేసారి చర్చించి అన్నింటిపైనా పరిష్కారం కుదుర్చుకోవాలన్నది తన ప్రతిపాదన అని ఆయన అననారు. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెప్పానని, రెండు రాష్ట్రాల వారిని కూర్చోపెట్టాలని నేను ప్రధానికి కూడా చెప్పానని, ప్రధాని వైపు నుంచీ ఏ రకమైన స్పందన కూడా లేదని చంద్రబాబు వివరించారు.