త్వరలో ఏపీ శుభవార్త వింటుంది: జైట్లీ, నో కాంప్రమైజ్ అన్న లోకేష్
న్యూఢిల్లీ: ఏపీకి హోదా కంటే ఎక్కువ ప్యాకేజీనే ఇస్తామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్వరలో శుభావార్త వింటారని, ప్రత్యేక హోదాతో 30 శాతం నిధులే అదనంగా వస్తాయని, అంతకన్నా ఎక్కువ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్యాకేజీ సిద్ధమవుతోందని, ఏపీకి ఎంత ఎక్కువ సాయం చేయగలమన్న దానిపై కసరత్తు జరుగుతోందన్నారు. హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ ఏపీకి కల్పిస్తామన్నారు. కొన్ని ముఖ్యమైన కేంద్ర పథకాలకు ఇప్పటికే తొంభై శాతం నిధులను కేంద్రం భరిస్తోందన్నారు.
మరికొన్ని పథకాలకు మాత్రమే అరవై శాతం నిధులు ఇస్తున్నామన్నారు. హోదాతో వచ్చే 30 శాతం అదనపు నిధులను ఎంత ఎక్కువ ఇవ్వగలమన్న దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. 30 శాతం కన్నా ఎక్కువ మొత్తాన్ని వేరే మార్గంలో ఏమైనా ఇవ్వవచ్చా అన్న అంశాన్నీ పరిశీలిస్తున్నామన్నారు.
ఇప్పటికే ప్రకటించిన పారిశ్రామిక రాయితీలే కాకుండా మరిన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. మిగిలిన రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా ఏపీకి ఎలా ఇవ్వడమా? అన్నదే తమ ముందున్న ప్రధాన సమస్య అన్నారు.
జైట్లీ విలేకరులతో మాట్లాడే సమయంలో బీహార్కు చెందిన మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా అక్కడే ఉన్నారు. ఆయన జోక్యం చేసుకుంటూ.. ఏపీ కన్నా ముందు బిహార్కు ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనన్నారు. బీహార్కు ప్రత్యేక హోదాపై కేంద్రం ఎప్పుడో హామీ ఇచ్చిందన్నారు.
మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాము రాజీపడమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. హోదా పైన మాట్లాడేందుకు చంద్రబాబు కేంద్రం వద్ద భయపడుతున్నారని జగన్, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. హోదా కోసం తాము కేంద్రంతో రాజీపడేది లేదన్నారు.