వారికి పాదాభివందనం, కట్టుబట్టలతో వచ్చాం: బాబు, 'వామ్మో జగన్!'
విజయవాడ: అభివృద్ధి కావాలంటే భూములు కావాలని, ఆకాశంలో మనం నిర్మాణాలు కట్టలేని, గన్నవరం విమానాశ్రయానికి, రాజధానికి భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు నేను పాదాభివందనం చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో నిర్మించనున్న కొత్త టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.
మనం రాజధాని లేకుండా కట్టుబట్టలతో వచ్చామని చంద్రబాబు చెప్పారు. కానీ అధైర్యపడకుండా అభివృద్ధిలో దూసుకుపోవాలన్నారు. రాజధాని నిర్మాణం అందరి భాద్యత అని చెప్పడంతో... ఎంతమంది రెచ్చగొట్టినా రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారన్నారు. కేంద్రం మనకు ఎన్నో విషయాల్లో సహకరిస్తోందన్నారు.
పెట్టుబడులకు ప్రపంచంలోనే అనువైనది భారత దేశం అన్నారు. దేశంలో ఏపీని నెంబర్ వన్గా నిలుపుతానని చెప్పారు. కేంద్రం మనకు సహకరిస్తోందని, అలాగే ఢిల్లీలో వెంకయ్య ఉండటం, ఆయన మనకు సహకరించడం అభినందించదగ్గ విషయమన్నారు.
ఏపీకి కేంద్రం సహకారం అవసరమన్నారు. కొత్త రాష్ట్రమైన ఏపీకి పెట్టుబడులు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు.. వీటన్నింటి దృష్ట్యా కేంద్రం సహకారం అవసరమని చెప్పారు. కేంద్రం మనకు సహకరిస్తోందని, భవిష్యత్తులోను సహకరిస్తుందన్నారు.
కాంగ్రెస్, వైసిపిలకు ఏపీ అభివృద్ధి కావడం ఇష్టం లేదన్నారు. విమానాశ్రయానికి, రాజధానికి, పట్టిసీమకు.. ఇలా అన్నింటికి వారు వ్యతిరేకమన్నారు. దేశంలో అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. 2018లోపు గోదావరి నీటిని కృష్ణా నీటితో అనుసంధానం చేస్తామన్నారు.
అమరావతి నిర్మాణం ఆగదు: ధూళిపాళ్ల
గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోమవారం పొన్నూరులో మన మట్టి - మన నీరు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి కోసం మట్టి, నీరు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనూ జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండరన్నారు.
రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి పనులను జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు, పర్యావరణ అనుమతులు రాకుండా జగన్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా అమరావతి నిర్మాణం ఆగదన్నారు. టీడీపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న అక్కసుతోనే జగన్ ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు.