విభజన వద్దని వారితోనే చెప్పిస్తాం: చిరంజీవి వ్యాఖ్య
హైదరాబాద్: రాష్ట్రానికి ఆంటోని కమిటీని రప్పించి, పరిస్థితులను చూపిస్తామని, విభజన అవసరం లేదని ఆ కమిటీతోనే చెప్పిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం అన్నారు. పార్టీ నేతలుగా, మంత్రులుగా అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తామని, అంతకంటే స్థానికంగా ఉన్న ప్రజల ఆకాంక్షలకు విలువను, ప్రాధాన్యాన్ని ఇస్తామని కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు.
తెలుగు వారిని రక్షించుకునేందుకు అవసరమైతే ఏ చర్యలు తీసుకోవడానికైనా కంకణబద్దులుగా ఉంటామని మంత్రి జెడి శీలం చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నామని చెప్పారు. అధిష్ఠానం సూచన మేరకే తాము పదవుల్లో కొనసాగుతున్నామని వివరించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాన్ని అధిష్ఠానమే చేయాల్సి ఉందన్నారు.
ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకునేంత వరకూ విభజనపై ఎలాంటి ముందడుగు వేయవద్దని కోరతామని వివరించారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజల పరిస్థితిని వారికి అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. సీమాంధ్రలో పథకాలు అందక ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు జరగక పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కాగా, రాష్ట్ర విభజనకు సంబంధించి సిడబ్ల్యూసి తీర్మానంపై చర్చించేందుకు శనివారం మంత్రుల క్వార్టర్స్లో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం వారు విలేకరులతో మాట్లాడి సమైక్యం కోసం రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు.