అడ్డుకుంటాం: రాజధానిపై పెద్దిరెడ్డి, విడగొట్టే పరిస్థితొద్దని..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకటిస్తే తాము అడ్డుకుంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఏపిలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
గతంలో లాగే ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని విడగొట్టే పరిస్థితి తీసుకురావొద్దని పెద్దిరెడ్డి అన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మేరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అన్నారు. శాసనసభలో ప్రకటించకముందే మీడియాకు రాజధానిపై తెలుపడం సరికాదన్నారు.

శాసనసభలో రాజధానిపై చర్చ జరిగిన తర్వాతనే సభానాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటన చేసిన తర్వాత చర్చ జరగడమనేది సభా సాంప్రదాయానికి విరుద్ధమని ఆయన అన్నారు. తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా చర్చ జరిగిన తర్వాతే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. శాసనసభలో రాజధాని ప్రకటనపై ఓటింగ్ కోరతామని చెప్పారు.
సభానాయకుడు ప్రకటించిన తర్వాత చర్చ అప్రస్తుతమని పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. రాజధానిపై ప్రకటనను అడ్డుకుంటామని అన్నారు. 1952లో కూడా చర్చ జరిగిన తర్వాతే ఓటింగ్ నిర్వహించి రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సభానాయకుడు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
మరో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి 50వేల ఎకరాలు ఉన్న చోటే రాజధాని ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని ప్రకటనపై ఓటింగ్ కోరతామని చెప్పారు. కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపి అభివృద్ధిని కోరుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపించారు. కుక్క తోక వంకర అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications