తీవ్ర నిరాశే, నేర్చుకుంటాం: ఫలితాలపై చిరంజీవి
హైదరాబాద్: ప్రజలు ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశే కలిగించిన మాట నిజమేనని కాంగ్రెసు సీమాంధ్ర ప్రచార సారథి, కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. పార్టీకి వివిధ వర్గాల ప్రజలు ఎందుకు దూరమయ్యారో నిజాయితీగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అధికారంలో ఉన్న గత పదేళ్లలో జరిగిన లోపాలు, తప్పుల నుంచి విలువైన గుణపాఠం నేర్చుకుని పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పునర్నిర్మించడానికి అవసరమైన చర్యలను పార్టీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందనే విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఆయన చెప్పారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవికి సీమాంధ్ర ప్రచార సారథ్య బాధ్యతలను కాంగ్రెసు అధిష్టానం అప్పగించింది. పార్టీని నిలబెట్టడానికి, పార్టీ వైపు ప్రజలను ఆకర్షించడానికి ఆయన తీవ్రంగానే ప్రయత్నించారు. బస్సు యాత్ర కూడా నిర్వహించారు. అయినా, ప్రజలు కాంగ్రెసును తిరస్కరించారు.