నేనే సిఎంనైతే, ఢిల్లీ తుఫాను ఆపుతాం: టిజి సంచలనం
హైదరాబాద్: చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అయితే కనుక విభజనవాదులను లోపల పడేస్తానని వ్యాఖ్యానించారు. తాము ముంచుకొస్తున్న తుపానును ఆపలేమో కానీ ఢిల్లీ నుండి వస్తున్న తుఫానును మాత్రం ఆపుతామన్నారు.
ఆయన హైదరాబాదులో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తనకు సిఎం పదవి వస్తే విభజనవాదులను జైల్లో వేస్తానన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు కొందరు నేతలు సమైక్యాంధ్ర యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ తుఫానును ఆపేందుకు తాము ప్రయత్నాలు చేస్తామన్నారు.

లక్షల మందితో కలిసి త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. అసెంబ్లీని రద్దు చేస్తే అంతకన్నా అదృష్టం లేదన్నారు. స్పీకర్ ఎప్పుడూ పొరపాటు చేయరని నమ్ముతున్నట్లు టిజి వెంకటేష్ చెప్పారు.
అంటరానివారిగా చూస్తున్నారు: ఏరాసు
సీమాంధ్ర వారిని మంత్రుల బృందం (జివోఎం) అంటరానివారిగా చూస్తోందని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంత సమస్యలను పరిష్కరించాకే విభజన చేయాలన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్న కేంద్రానికి దానిని ఎలా చేస్తామని ఇప్పటి వరకు చెప్పలేకపోతోందన్నారు. విభజన పద్ధతి ప్రకారం జరగడం లేదని, సమస్యలు పరిష్కరించకుండా విభజిస్తే తాము తలలు పగులగొట్టుకోవాలా అని ఆగ్రహించారు.












Click it and Unblock the Notifications