ఏపీ, తెలంగాణలో వచ్చే 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పిడుగులుపడే అవకాశం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి.
హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. ఇది రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
ఏపీలోనూ రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా.. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. బుధవారనం నాటికి ఇది ఏపీ తీరం వైపునకు పయనించనుంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసమీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తా, రాయలసీమలో వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్
రాయలసీమ, కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులూ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని.. రానున్న మూడు రోజులపాటు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. కాగా, సోమవారం కూడా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళ, బుధవారాల్లోనూ రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.