AP weather: రాత్రి నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల, ఉభయగోదావరి జిల్లాలు, కర్నూలు, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక విశాఖపట్నంలో నల్లని మేఘాలు దట్టంగా అలుముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది.
విశాఖపట్నంలోని మధురవాడ, పీఎంపాలెం, ఆనందపురం, చంద్రంపాలెం, రుసికొం, ఎండాడ, డెయిరీ ఫామ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు రాజమహేంద్రవరంతోపాటు కోనసీమ వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. కర్నూలు జిల్లాలోని హలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వాగులు పొంగాయి. ఈ క్రమంలో పలుమార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
మెదేహాల్ వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురికావడంతో ఏపీ-కర్ణాటక రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు జిల్లాల్లో సోమవారం కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.
నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చేరనున్న క్రమంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండల తీవ్రత నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం లభిస్తోంది.