Breaking: అచ్చెన్న అరెస్టు వెనక.. స్కామ్లో ఆయన పాత్ర ఏంటి...ఉచ్చులో మరో మాజీ మంత్రి..?
అమరావతి: టీడీపీ ముఖ్యనేతపైన జగన్ ప్రభుత్వం భారీ దెబ్బకొట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆ పార్టీ ఉపనేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్టు చేసింది. ఈఎస్ఐ స్కామ్లో ఆరునెలలుగా విచారణ చేస్తున్న ఏసీబీ పక్కా ఆధారాలతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలోని తన స్వగ్రామంలో నిమ్మాడలో ఉన్న అచ్చెన్నాయుడును భారీ బలగాలతో వెళ్లిన ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన్ను ఈఎస్ఐ స్కామ్లో పూర్తి ఆధారాలతో అరెస్టు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచి విచారణకు అదుపులోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడు సహా తప్పుచేసిన వారిపై చర్యలు: మంత్రి జయరాం
రూ.200 కోట్లు స్కామ్లో అచ్చెన్న
2014లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక...చంద్రబాబు కేబినెట్లో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2017 వరకు ఆయన అదే శాఖలో కొనసాగారు. తెలంగాణలో దేవికారాణి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఏపీలోనూ ఈఎస్ఐలో జరిగిన వ్యవహారాలపైనా దృష్టిపెట్టారు. జగన్ ప్రభుత్వం ఈ ఎపిసోడ్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ చేయించింది. పలువురు సిబ్బందిని విచారణ చేసిన సమయంలో నాటి మంత్రి పేషీ నుండి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే తాము నిర్ణయాలు తీసుకున్నామని విచారణలో వెల్లడించారు. దీంతో జగన్ ప్రభుత్వం మరింత పక్కా దర్యాప్తు కోసం ఏసీబీని రంగంలోకి దించింది.
ఓ డాక్టరు ఇచ్చిన సమాచారంతోనే..
విచారణలో భాగంగా తిరుపతిలోని ఓ వైద్యుడు ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. అక్కడ తీగలాగగానే డొంక కదిలినట్లుగా ఈఎస్ఐ అక్రమాల్లో భాగస్వాములైన అందరి వివరాలను తేటతెల్లమయ్యాయి. ఇక మంత్రి పేషీ నుంచి వచ్చిన ఒత్తిళ్లపైనా ఏసీబీ లోతుగా విచారణ చేసింది. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఖరారు చేయించారని నివేదికలో తేల్చారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్లు ఇప్పించారని అధికారులు గుర్తించారు. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలింది. కాంట్రాక్టులు లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ.51 కోట్లు చెల్లించినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.
చంద్రబాబు కుడి భుజానికి భారీ దెబ్బ
అచ్చెన్నాయుడి వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించాకే ఏసీబీ అరెస్టు చేసింది. మందుల పరికరాలు వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా ధరలు చెల్లించినట్లు ఆధారాలతో సహా నిరూపించారు. అయితే ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి పాత్రలేదని అధికారులు తక్కువ ధరకు వస్తున్నాయంటేనే తాను అంగీకరించానని గతంలో అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజా కేబినెట్ సమావేశంలో ఫైబర్ నెట్ పైన సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఇప్పుడు అచ్చెన్నాయుడును అరెస్టు చేసి టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది.
చంద్రబాబు సమర్థించగలరా..?
చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై సీరియస్గా దృష్టిపెట్టిన జగన్ ప్రభుత్వం ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తోంది. ఈఎస్ఐ కొనుగోళ్ల టెండరింగ్లో అచ్చెన్నాయుడితో పాటుగా మరో మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఆమంత్రి కుమారుడి జోక్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే తొలుత మంత్రిగా పనిచేసిన అచ్చెన్నను అరెస్టు చేసిన ఏసీబీ... ఇప్పుడు మాజీ మంత్రి కుటుంబ సభ్యులను విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. పక్కా ఆధారాలతో అచ్చెన్నను అరెస్టు చేసిన ఏసీబీ ఆయనతో పాటుగా డీఐఎంఎస్ డైరెక్టర్ రమేష్ కుమార్ పాత్రను నిర్ధారించింది. మంత్రి ఆదేశాల మేరకే నాడు తాను కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్లు రమేష్ కుమార్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఏసీబీ నుంచి అందుతున్న సమాచారం మేరకు 155 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇక ఇప్పుడు టీడీపీకి చెందిన మరో మాజీ మంత్రి సైతం ఏసీబీ వలలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.