వలంటీర్లపై ప్రశ్నలను సంధించిన పవన్ కల్యాణ్: పీఎంఓ, కేంద్ర హోం శాఖ దృష్టికి
అమరావతి: వలంటీర్లు హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల దుమారం కొనసాగుతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కొన్ని రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ- అటు పవన్ కల్యాణ్ గానీ, జనసేన పార్టీ గానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. వలంటీర్ల వ్యవస్థపై తమ దాడిని కంటిన్యూ చేస్తోన్నారు.
వలంటీర్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా గతంలో ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి వలంటీర్ల వ్యవస్థపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రశ్నాస్త్రాలను సంధించారు. దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. వలంటీర్ల బాస్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. వ్యక్తిగత డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలు ఇస్తారని నిలదీశారు. వలంటీర్ల వ్యవస్థ అనేది ఓ ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు అని ప్రశ్నించారు.

వలంటీర్లది ప్రభుత్వ విభాగమే అయితే ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించమని వారిని ఎవరు ఆదేశించారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా?, ముఖ్యమంత్రా?, కలెక్టరా లేక ఎమ్మెల్యేనా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తన ట్వీట్ను ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలకు ట్యాగ్ చేశారు.
వలంటీర్లు ఏ ప్రభుత్వ శాఖకూ చెందని వారంటూ జనసేన పార్టీ చేసిన ట్వీట్కు పవన్ కల్యాణ్ స్పందించారు. వలంటీర్లు డేటాను సేకరించడంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని జనసేన పేర్కొంది. ఓ వీడియోను ట్వీట్ చేసింది. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్సీపీపై తిరుగుబాటు మొదలు పెడతారని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications