జగన్ వ్యాఖ్య-శిల్పాకు దెబ్బ: వైసిపి భయపడిందే జరిగిందా? అఖిలకు నిజంగా ప్లస్సా?
చంద్రబాబుపై జగన్ చేసిన 'కాల్చివేత' వ్యాఖ్యలు నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ సమయంలోను చర్చకు తావిచ్చాయి.చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తప్పుబట్టింది.
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసిపి అధినేత జగన్ చేసిన 'కాల్చివేత' వ్యాఖ్యలు నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ సమయంలోను చర్చకు తావిచ్చాయి.
నంద్యాలలో చక్రం తిప్పేది వాళ్లే!: దాని పైనే జగన్-బాబు గెలుపు లెక్కలు
చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తప్పుబట్టింది. జగన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
వైసిపికి దెబ్బేననే అభిప్రాయం
నంద్యాల ఉప ఎన్నికల రోజే జగన్పై చర్యలు తీసుకోవాలని ఈసీ చెప్పింది. సరిగ్గా పోలింగ్ రోజే ఈ వ్యాఖ్యలు తమకు నష్టం కలిగించేవేనని వైసిపి నేతలు భావిస్తున్నారు. ఈసీ నిర్ణయం శిల్పా మోహన్ రెడ్డికి దెబ్బేనని టిడిపి నేతలు కూడా భావించారు.
సెల్ఫ్ గోల్ అంటూ ముందే చెప్పిన టిడిపి
వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుపుకు జగనే దెబ్బ వేసారని టిడిపి నేతలు ఇటీవల చెబుతూ వస్తున్నారు. జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలతో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలు పోలింగ్పై ప్రభావం చూపుతాయని, శిల్పాకు దెబ్బేనని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు.
భయపడిందే జరుగుతోందా?
జగన్ వ్యాఖ్యల వల్ల శిల్పాకు దెబ్బ పడిందని టిడిపి నేతలు చెబుతున్నారు. ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయని అంటున్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ నెల 21న ఈసీ తప్పుపట్టగా, ఇప్పుడు బయటకు చెప్పడం ఏమిటని వైసిపి నేతలు ప్రశ్నించారు. వైసిపి నేతల ఆరోపణలు, భయాందోళను చూస్తుంటే.. జగన్ వ్యాఖ్యలే వైసిపికి దెబ్బ అన్న టిడిపి నేతల వాదనతో ఏకీభవించినట్లుగా ఉందంటున్నారు.
వైసిపి నేతల ఫిర్యాదు
నంద్యాల ప్రచారం తొలి రోజు జగన్.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాల్చివేయాలని మాట్లాడారు. దీనిపై టిడిపి నేతలు ఈసీకి ఫిర్యాదు చేయగా, బుధవారం (ఈరోజు) ఆయన వ్యాఖ్యలపై ఆదేశాలు వచ్చాయి. దీంతో వైసిపి నేతలు ఈసీ భన్వర్ లాల్ను కలిశారు. రెండు రోజుల క్రితం జగన్పై ఆదేశాలు వస్తే ఇప్పుడు విడుదల చేయడం ఏమిటని అడిగారు.
ఉప ఎన్నిక సమయంలో అఖిలకు సంతోషం
పోలింగ్ రోజే జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తప్పుపట్టడం వైసిపికి ఇబ్బందికర పరిణాం కాగా, ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అఖిలప్రియకు, అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి, టిడిపికి సంతోషమనే చెప్పవచ్చు.
ఈసీ ఆదేశాల ప్రభావం ఓటింగ్ పైన ఉంటుందా?
అదే సమయంలో పోలింగ్ రోజున జగన్ పైన ఆదేశాల నేపథ్యంలో ఇది ఓటింగ్ పైన ఏ మేరకు ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆదేశాల ప్రభావం ఉండదని అంటున్నారు.