తెలంగాణ నుంచి కలపకుంటే, జగన్ గురించి తెలియదా: ఉండవల్లికి సోమిరెడ్డి
విజయవాడ: తెలంగాణ నుంచి ఏడు మండలాలు ఏపీలో కలపకుంటే పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలిపోయేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ప్రతిపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికహక్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు.
రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మట్టి పనులు చేసి, కాలువలు తవ్వి నేతలంగా ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు.
జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ఈ విషయం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్కు తెలియదా అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వద్దని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైసిపి నేతలతో చెప్పించారని విమర్శించారు.
అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్
అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మారథాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వారంలో 150 నిమిషాలు ఏదో ఒకరకమైన వ్యాయామం చేస్తే గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చన్నారు.
అలాగే భారత్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన తక్కువగా ఉందన్నారు. మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ... బాల్యం నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో మారథాన్ నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.