సీమాంధ్రలోనూ కెసిఆర్పై పవన్ దాడి: లెక్కేమిటి?
హైదరాబాద్: కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సీమాంధ్రలో అసలు పోటీలో లేదు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీమాంధ్ర ఎన్నికల ప్రచార సభల్లో కెసిఆర్పై వరుస పెట్టి దాడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో తెలుగుదేశం, బిజెపి అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా దాడి చేస్తున్నారు.
జగన్పై విమర్శలు చేయడంలో అర్థం ఉంది గానీ కెసిఆర్ను విమర్శించడంలోని లెక్కేమిటనే ఆలోచన రాక మానదు. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే కెసిఆర్పై విమర్శలు చేస్తున్నారని అర్థమవుతోంది. తన సినిమాల విషయంలో కెసిఆర్ కుటుంబ సభ్యులు, తెరాస కార్యకర్తలు తెలంగాణలో వ్యవహరించిన తీరు ఆయనకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించిన మాటలో నిజమే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

అయితే, కెసిఆర్ను విమర్శించడం వల్ల తెలుగుదేశం, బిజెపిలకు సీమాంధ్రలో కలిగే లాభం ఏమిటనేది ప్రశ్న. సీమాంధ్ర ప్రజలు విభజనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఆయన లెక్కలు వేస్తున్నారు. రాష్ట్ర విభజనకు బిజెపి, తెలుగుదేశఁ పార్టీలు కూడా కారణమనే విమర్శ వైయస్సార్ కాంగ్రెసు నుంచి వస్తోంది. చంద్రబాబు వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జగన్, షర్మిల, విజయమ్మ విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో అన్యాయానికి సీమాంధ్ర, తెలంగాణ పాలకవర్గాలు కారణమని, కానీ కెసిఆర్ సీమాంధ్ర ప్రజలపై విద్వేషం పెరిగేలా విమర్శలు చేశారని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టారని ఆయన అంటున్నారు. ఇదే సమయంలో కెసిఆర్కు, జగన్కు మధ్య అవగాహన ఉందనే రీతిలో మాట్లాడుతున్నారు. కాంగ్రెసుతో ఆ ఇద్దరు కలిసి పోయారని ఆయన చెప్పదలుచుకున్న విషయం. అందువల్ల కెసిఆర్ను బలపరుస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఓడించాలని ఆయన నర్మగర్భంగా చెబుతూ కెసిఆర్పై ఉన్న వ్యతిరేకతను జగన్పై కూడా కల్పించాలని ఆయన భావిస్తున్నారు.
అయితే, కెసిఆర్ను పదే పదే సీమాంధ్రలో పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల బిజెపికి, టిడిపి ఏ మేరకు లాభిస్తుందనేది చెప్పడం కష్టమే. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా కెసిఆర్పై సీమాంధ్రలో విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications