చంద్రబాబుపై శివప్రసాద్ నిప్పులు: తెర వెనక జరిగిన కథ ఇది! టీడీపీలో కలవరం
అమరావతి/చిత్తూరు: శుక్రవారం చిత్తూరులో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటుసభ్యుడు శివప్రసాద్... ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఒక్కసారిగా తీవ్రస్తాయిలో నిప్పులు చెరగడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఆయన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో కలవరం పుట్టిస్తున్నాయి.

అసంతృప్తి సెగలు
ఒక్కసారిగా ఇంత తీవ్రంగా పార్టీ అధినేతపైనే విమర్శలు చేయడం దేనికి సంకేతమని పలువురు చర్చించుకుంటున్నారు. గత కొంత కాలం నుంచి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి సెగలు ఈ విధంగా బయటపడ్డాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.

తొలిసారి ఇలా..
పార్టీ సీనియర్ నేతగా చెలామణి అవుతున్న ఎంపీ శివప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇదే మొదటి కావడం గమనార్హం. దీంతో టీడీపీ నాయకత్వం, నేతలు ఎలా స్పందించాలో తెలియక తికమకపడుతున్నాయి. శివప్రసాద్ పార్టీకి ఏమైనా దూరమవుతున్నారా? లేక కేవలం తన మనసులో ఉన్న అసంతృప్తి తెలియజేశారా? అనేదానిపై టీడీపీలో తర్జనాభర్చనలు జరుగుతున్నాయి.

చంద్రబాబు మోసం చేశారంటూ..
చంద్రబాబు దళితులను మోసం చేశారని, తీరని అన్యాయం చేశారని ఎంపీ శివప్రసాద్ విరుచుకుపడ్డారు. ఏడాది పొడవునా 125వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతికి జిల్లా కలెక్టర్ గౌర్హజరవడంపైనా శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దళితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

ఏ పదవులూ ఇవ్వలేదు..
అంతేగాక, ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములు లాక్కుని వారిని కూలీలుగా మార్చారంటూ సొంత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు శివప్రసాద్. కేంద్రంలో రెండు మంత్రి పదవులు వస్తే... అవి రెండూ కూడా ఓసీలకే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీలకు పదవులిస్తే రెండు కూడా గుంటూరు ప్రాంతం వారికే ఇచ్చేశారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవులు కూడా కాపులు, బీసీలకు ఇచ్చారని.. ఎస్సీలకు అన్యాయం చేశారని అన్నారు.

విమర్శల వెనుక...
చంద్రబాబుపై శివప్రసాద్ తీవ్ర విమర్శల వెనుక గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలే కారణంగా తెలుస్తోంది. ఇటీవల తన సొంత కూతురు విషయంలో మాజీ మంత్రి బొజ్జల వర్గీయులు అనుచితంగా ప్రవర్తిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండగా నిలబడ్డాడే గానీ, టీడీపీ వర్గంవారు కనీస మద్దతు కూడా తెలుపలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు గానీ, ప్రస్తుత మంత్రి లోకేష్ గానీ ఈ విషయంపై స్పందించలేదు. ఈ వ్యవహారం కూడా శివప్రసాద్ ఫైరవడానికి ఓ కారణంగానే తెలుస్తోంది.

బాబుతో విభేదించి...
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ ఎంపీ శివప్రసాద్ మొదట్నుంచీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. హోదా కోసం పార్లమెంటు తన గళం వినిపించిన శివప్రసాద్.. పలు వేషాలతో కేంద్రప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. చంద్రబాబు హోదా కంటే ప్యాకేజీ ఉత్తమమని చెబుతుంటే.. శివప్రసాద్ మాత్రం హోదా కోసం తన పోరాటాన్ని కొనసాగించారు. తన నిరసనను టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదని అసంతప్తి కూడా శివప్రసాద్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇది మరో కారణంగా చెప్పవచ్చు.

జగన్ పార్టీ వైపు చూస్తున్నారా..?
ఈ క్రమంలోనే టీడీపీలో తన స్థానమేంటని శివప్రసాద్ తనను తాను ప్రశ్నించుకున్నట్లు అర్థమవుతోంది. అయితే, ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో శివప్రసాద్ పార్టీ మారడంపై చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ మారినా చిత్తూరు నుంచే శివప్రసాద్కు అవకాశం కల్పించే విధంగా చర్చలు కొనసాగించినట్లు సమాచారం. గతంలో చిత్తూరు నుంచి టీడీపీ తరపున శివప్రసాద్ బరిలో ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాన్య కిరణ్ పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications