భార్యను పుట్టింటికి పంపి భర్త ఏం చేశాడంటే?
సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకొన్నాడు ఓ ప్రబుద్దుడు. అయితే ఈ విషయం తెలుసుకొన్న మొదటి భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది.
కర్నూల్: సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకొన్నాడు ఓ ప్రబుద్దుడు. అయితే ఈ విషయం తెలుసుకొన్న మొదటి భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది.
కర్నూల్ జిల్లా హోళగుండ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్లప్ప దంపతులకు నలుగురు సంతానం. మూడో కుమార్తె సత్యకళను నారాయపుణపురం గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులుకు ఇచ్చి 2002 జూన్ 16న, వివాహం చేశారు.
వీరిది మేనరికం. కట్నం కింద కొంత బంగారం కూడ ఇచ్చారు. వీరి వివాహమై 14 ఏళ్ళు గడిచినా వీరికి సంతానం కాలేదు. దీంతో మూడేళ్ళ నుండి రామాంజనేయులు భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.
అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడు. లేకపోతే రెండో పెళ్ళి చేసుకొంటానని వేధిస్తున్నాడు. అయితే సత్యకళ తండ్రి ఇటీవలే చనిపోయాడు.అయితే అదనంగా కట్నం ఇచ్చే పరిస్థితి లేదని ఆమె భర్తను వేడుకొంది. అయినా ఆయన వినలేదు.
ఈ విషయమై పెద్ద మనుషుల పంచాయితీ నిర్వహించారు.రామాంజనేయులుకు పెద్ద మనుషులు సర్థిచెప్పారు..కాపురానికి సత్యకళ వచ్చిన నాటి నుండి రామాంజనేయులు వేధింపులు తీవ్రమయ్యాయి.
అదనపు కట్నం తేవాలని, లేదా రెండో పెళ్ళికి ఒప్పుకోవాలని ఆమెను వేధించేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వారం రోజుల క్రితం సత్యకళను కొట్టి పుట్టింటికి పంపాడు. నారాయణపురం గ్రామానికి చెందిన ఈరప్ప,పార్వతి దంపతుల కుమార్తె అనితను రెండో పెళ్ళి చేసుకొన్నాడు రామాంజనేయులు. విషయం తెలుసుకొన్న సత్యకళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.