పరిటల హత్య వెనుక వైఎస్ ఫ్యామిలీ!: జగన్పై సునీత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి పరిటాల సునీత ఆదివారం నిప్పులు చెరిగారు. శాసన సభలో జగన్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. జగన్ తీరు చూసి ఆ పార్టీ నేతలే సిగ్గుపడుతున్నారన్నారు.
ఆమె అనంతపురం జిల్లాలో మాట్లాడారు. జగన్ అసెంబ్లీలో దౌర్జన్యం, రౌడీయిజం చేయాలని ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యేలేవీ లేనట్టు కొట్లాటల్లో చనిపోయిన వారి గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం సరికాదన్నారు.
పరిటాల రవి హత్యలో వైయస్ కుటుంబం పాత్ర ఉందన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారన్నారు. పరిటాల రవి హత్య కేసు పునర్విచారణ చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పరిటాల అభిమానులు డిమాండ్ చేస్తున్నారన్నారు.
రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వర్షాలు లేకపోవడం వల్ల పంటపొలాలు ఎండిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేరుగా అన్నారు. హైదరాబాదు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతుల ప్రాధాన్యత అంశాలను ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కిషన్ అన్నారు. రుణాల రీషెడ్యూలుకు సంబంధించి ఎప్పటిలోగా రైతులు తమ రుణాలను చెల్లించవచ్చో వారికి తెలియజేయాలన్నారు.