దిద్దుకోకుంటే అంతే, గెలిచినా: చంద్రబాబు ఆయనకు షాకిస్తారా?
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లలో పలువురు టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు టిక్కెట్లు విషయంలో షాకిచ్చే అవకాశాలున్నాయి.పనితీరు బాగా లేని, మెరుగుపర్చుకోలేని వారికి టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు.
నెల్లూరు: 2019 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్లలో పలువురు టిడిపి ఎమ్మెల్యేలకు అధినేత చంద్రబాబు టిక్కెట్లు విషయంలో షాకిచ్చే అవకాశాలున్నాయి. పనితీరు బాగా లేని, మెరుగుపర్చుకోలేని వారికి టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు.
పలువురు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. వారికి క్లాస్ కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. పనితీరు మెరుగుపర్చుకోకుంటే టిక్కెట్ ఇచ్చేది లేదని చెప్పనున్నారు.

గెలిచినా ఇప్పటికీ వ్యాపారాలే
ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే వెంకట రామారావు గురించి స్థానికంగా చర్చ జరుగుతోందని ప్రచారం సాగుతోంది. కాంట్రాక్టుల్లో డబ్బు సంపాదించి, రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటికీ వ్యాపారాల్లోనే బిజీగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నియోజకవర్గానికి చుట్టపు చూపుగా
ఎమ్మెల్యే నియోజకవర్గానికి చుట్టపుచూపుగా మాత్రమే వచ్చి వెళ్తున్నారని, స్థానికంగా పనులు చక్కబెట్టే విషయాలను తన అనుచరులకు అప్పగించారని అంటున్నారు. దీంతో నియోజకవర్గంలో వారితో పాటు, ఆయన పీఏ హవా నడుస్తోందనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయన పట్టనట్లుగా ఉంటున్నారంటున్నారు.

చల్లగా జారుకున్నారు
ఇటీవల ఆయన తన నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లగా జనాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారట. మూడున్నరేళ్లలో ఏం చేయలేదని, ఇప్పుడు ఊళ్లోకి వచ్చావా అని నిలదీసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆయన అక్కడి నుంచి జారీపోయారని తెలుస్తోంది. మరో గ్రామానికి వెళ్లినా అలాగే జరిగిందంటున్నారు. సొంతూరులోనే ఆయన తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు.

టిడిపిని దిగజార్చుతున్నారని ఆందోళన
ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో టిడిపి జనాల్లోకి వెళ్తోంది. కానీ ఉదయగిరిలో మాత్రం పెద్దగా లేదని తెలుస్తోంది. అంతేకాదు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయట. ఇదంతా స్థానికంగా టిడిపి ప్రతిష్టను దిగజార్చుతోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారని తెలుస్తోంది.

పార్టీ పెద్దల గుర్రు, టిక్కెట్ దక్కేనా
ఉదయగిరిలో పరిస్థితిపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారని కూడా తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొందరు టిడిపి నేతలు మాట్లాడుకొని, ముఖ్య నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అధిష్టానం టిక్కెట్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఉదయగిరిలో టిడిపి అధిష్టానం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, లేదంటే మొదటికే మోసం వస్తుందని, వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్నారట.












Click it and Unblock the Notifications