టిడిపితో మంతనాలు నిజమేనా, జగన్కు మరో షాక్ తప్పదా?: ఎన్నో డౌట్స్!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మరోసారి చేరికలు ప్రారంభం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మరోసారి చేరికలు ప్రారంభం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇటీవల వైసిపి అధినేత జగన్ గోదావరి జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోశారు.
ఈ నేపథ్యంలో టిడిపి నేతలు జగన్కు కౌంటర్ ఇస్తున్నారు. గోదావరి జిల్లాలో జగన్ తన పర్యటన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంతే ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.
రాజ్ భవన్ షాక్ తర్వాత మళ్లీ తగిలేనా?
గతంలో వైసిపి అధినేత జగన్ రాజ్ భవన్ ఎదుట మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యల తర్వాత ఇరవై మంది ఎమ్మెల్యేలు వైసిపిని వదిలి టిడిపిలో చేరారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోస్తామని జగన్ చెప్పినందువల్లే దానిని జీర్ణించుకోలేక తాము టిడిపిలో చేరుతున్నట్లు.. సైకిల్ ఎక్కిన కొందరు ప్రజాప్రతినిధులు తెలిపారు.
ఇప్పుడు మరోసారి జగన్కు అలాంటి షాక్ తగలడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా, గోదావరి జిల్లాలో జగన్ మాట్లాడుతూ.. దేవుడు దయతలిస్తే ఏడాదిలో ప్రభుత్వం కూలిపోవచ్చునని, అప్పుడు మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.
ఈ వ్యాఖ్యల పైన టిడిపి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో రాజ్ భవన్ ఎదుట మాట్లాడినందుకే జగన్ పరిహారం చెల్లించుకున్నారని, అప్పుడు ఇరవై మంది తమ పార్టీలో చేరారని, ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడితే మరికొంతమంది వస్తారన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెబుతున్నారు.
మంతనాలు జరుపుతున్నారా? టిడిపి నో వెకెన్సీ బోర్డు పెట్టిందా?
టిడిపి నేతలు ఇటీవల మాట్లాడుతూ.. పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి నేతలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారా అనే చర్చ సాగుతోంది. ఇరవై మందితో ఆగిన చేరికలకు మరోసారి తెరలేవనుందా అని చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
మరోవైపు, తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తాము నో వెకెన్సీ బోర్డు పెట్టామని టిడిపి నేతలు చెబుతున్నారు. ఎవరూ రాకపోయేసరికి నో వెకెన్సీ బోర్డు పెట్టామని చెబుతున్నారా? నిజంగానే చేరడానికి వస్తే.. స్థానిక నేతలతో కుదరదని నో వెకెన్సీ బోర్డు పెట్టినట్లు చెబుతున్నారా?
గతంలో 40 మంది వస్తారనుకుంటే ఇరవై మంది వచ్చారు. ఆ వచ్చిన ఇరవై మంది నియోజకవర్గాలలోని ఎక్కువ నియోజకవర్గాలలో ఇంకా పాత టిడిపి నేతలతో వైసిపి నుంచి వచ్చి చేరిన వారికి కుదరడం లేదు. ఈ నేపథ్యంలో నో వేకెన్సీ బోర్డు పెట్టినట్లు చెబుతున్నారా అనే చర్చ సాగుతోంది.