వైఎస్ జగన్, భారతమ్మ ఆశీస్సులతో.. వైరల్గా మారిన రాపాక కుమారుడి పెళ్లి పత్రిక!!
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి పెళ్లి పత్రిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎ,మ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకున్నారు.
జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని అందరూ భావించినప్పటికీ అందుకు భిన్నంగా ఆయన వైసీపీకి దగ్గరై జగన్ భజన మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాపాక వరప్రసాద్ ఏ మాత్రం అవకాశం దొరికినా జగన్ పై తన విధేయతను చాటుకుంటున్నారు. అసెంబ్లీలో సైతం జగన్ ను దేవుడు అంటే అనేకమార్లు వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆయన పొగడిన సందర్భాలున్నాయి.

ఇక తాజాగా ఆయన మరోమారు జగన్మోహన్ రెడ్డిపై తన విధేయతను ప్రదర్శించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కుమారుడి వివాహం జూన్ 7వ తేదీ రాత్రి ఒంటిగంట రెండు నిమిషాలకు జరగనుంది. ఈ క్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి పత్రిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అందుకు కారణం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి పెళ్లి పత్రిక పై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు భారతమ్మ గార్ల ఆశీస్సులతో అంటూ వారిద్దరి ఫోటోను పెళ్లి పత్రిక పై వేసి ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ పెళ్లి పత్రిక చూసి సంతోషం వ్యక్తం చేస్తుంటే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రాపాక వరప్రసాద్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి రాపాక వర ప్రసాద్ జగన్ భజన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ రాజోలు నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications