ఇంటి గొడవ: జయదేవ్పై బాబుకు మహిళ ఫిర్యాదు, ఏం జరిగింది?
గుంటూరు: ఎంపీ గల్లా జయదేవ్ ఇంటి యజమాని పద్మజ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తమకు న్యాయం చేయాలని ఆమె సీఎంను వేడుకున్నారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తమ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నారని ఆరోపించారు.
బ్యాంకు లోన్ చెల్లించని కారణంగా రూ.9 కోట్ల విలువైన ఇంటిని వేలంలో రూ.3.9 కోట్లకే దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జయదేవ్ తన పలుకుబడిని ఉపయోగించి హైకోర్టు స్టేను వెకేట్ చేయించారని చెప్పారు.
పద్మజ వ్యాఖ్యల పైన ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. బ్యాంకుకు పద్మజ రూ.2.8 కోట్లు బకాయి పడ్డారని, బ్యాంకు వేలంలో రూ.3.09 కోట్లకు ఇంటిని కొనుగోలు చేశామని చెప్పారు. హైకోర్టు స్టే ఇచ్చి తర్వాత వెకేట్ చేసిందని 25 శాతం డబ్బు వేలం రోజే చెల్లించామని, ఇందులో ఎలాంటి కబ్జా లేదన్నారు.

ఏం జరిగింది?
గుంటుపల్లి శ్రీనివాస రావు, పద్మజ దంపతులు గుంటూరు బృందావన్ గార్డెన్సులోని 300 గజాల్లో మూడు అంతస్తుల బవనాన్ని 2013లో బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2.30 కోట్ల రుణం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బ తినడంతో ఈఎంఐ చెల్లించలేకపోయారు.
ఈ భవనాన్ని 2014 ఎన్నికలకు సమయంలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో అది వేలానికి వచ్చింది. ఆ తర్వాత దీనిని గల్లా జయదేవ్ సొంతం చేసుకున్నారు.
అయితే, దీని మార్కెట్ విలువ కంటే తక్కువ ఇచ్చి కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.7.5 కోట్ల మార్కెట్ విలువ ఉన్న భవన ప్రారంభ ధర రూ.2.80 కోట్లుగా నిర్ణయించి బ్యాంకు ఇటీవల వేలం ప్రకటన జారీ చేసింది. దీనిపై యజమాని శ్రీనివాస రావు డెట్ రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు.
తన బాకీ మొత్తం రూ.1.98 కోట్లు చెల్లించేందుకు కొంత గడువు కావాలని కోరారు. జూన్ 24వ తేదీలోగా రూ.కోటి చెల్లిస్తే మిగతా సగం చెల్లించేందుకు గడువు ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను పక్కన పెట్టి వేలానికి సిద్ధమైందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications