మిత్రుడితో బైక్పై వెళ్తుండగా యాసిడ్ దాడి: మహిళ మృతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తున్న ఓ మహిళపై కొందరు గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. బైక్పై వెళ్తున్న మహిళను దుండగులు గూడవల్లి దగ్గర అడ్డుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో మహిళ, ఆమె స్నేహితుడు రాజేష్లు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాణి అనే ఆ మహిళ మరణించింది.
రాజేష్ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాణి భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యాసిడ్ దాడిలో రాణికి స్వల్పంగానే గాయాలయ్యాయి. అయితే, దాడి సమయంలో ఆమె కింద పడిపోయింది. దాంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. తలకు తగిలిన గాయాల కారణంగానే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.