ఉత్తరాఖండ్-ఆకివీడు: 8ఏళ్ల తర్వాత కూతురు వద్దకు చేరిన తల్లి
పశ్చిమగోదావరి: ఓ మహిళ ఎనిమిదేళ్ల తర్వాత తన సొంత ఊరును, కుటుంబాన్ని కలుసుకుంది. దీంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. పశ్చమగోదావరి జిల్లాకు చెందిన ఆ మతిస్థిమితం సరిగా లేని ఆ మహిళ.. ఉత్తరాప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లగా.. పోలీసులు ఆమె ఆచూకీ కనుగొని కుటుంబసభ్యులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే... జిల్లాలోని సిద్ధాపురం గ్రామానికి చెందిన కేతా సత్యవతి (50) ఎనిమిదేళ్ల క్రితం ఇంటి నుండి అదృశ్యమయ్యింది. కాగా, ఆమెకు మానసిక స్థితి సరిగా లేదు. ఆమె కోసం కుటుంబసభ్యులు ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. అయితే నాడు ఇంటి నుండి వెళ్లిపోయిన సత్యవతి రైలెక్కి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ వెళ్లిపోయింది.
మానసిక స్థితి సరిగాలేని ఆమెను అక్కడి అధికారులు నాలుగేళ్లపాటు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఆమెను ఒక స్వచ్ఛంద సేవాసంస్థకు అప్పగించారు. అయితే ఆమెకు మళ్లీ గతం గుర్తుకు రావడంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్థానిక న్యాయస్థానానికి అప్పగించారు.

ఆమె చెప్పిన ఆధారాలకు అనుగుణంగా బంధువుల వద్దకు చేర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డెహ్రాడూన్ పోలీస్ సిబ్బంది గుల్షర్ మాలిక్, మంజూ, బినా సోమవారం సత్యవతిని ఆకివీడు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. స్థానిక పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆకురాతి సూర్యనారాయణ, హోంగార్డ్ బషీర్ సహాయంతో ఆమెను మంగళవారం సిద్ధాపురంలోని ఆమె కుమార్తెకు అప్పగించారు.
కాగా, సత్యవతికి ఇద్దరు కుమార్తెలు. ఆమె ఇంటినుండి వెళ్లిపోయే నాటికి వారికి వివాహం కాలేదు. ఆ తర్వాత కుమార్తెలకు వివాహాలు జరిగిపోయాయి. చిన్నకుమార్తె విజయలక్ష్మి సిద్ధాపురంలో ఉండటంతో ఆమెకు సత్యవతిని అప్పగించారు. చనిపోయిందనుకున్న తల్లి సత్యవతి తిరిగిరావడంతో ఆమె కుటుంబంలో ఆనందోత్సాహా లు వెల్లివిరిశాయి. తమ తల్లిని క్షేమంగా తమకు అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications