YS Jagan: వైసీపీలో ఎక్కువైన గొణుగుళ్లు? కట్టు దాటుతున్న నేతలు
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా గొణుగుళ్లు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటైన ప్రారంభంలో ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే అది చెల్లుబాటు అయ్యేది. మూడు సంవత్సరాలు తిరిగేసరికి పరిస్థితుల్లో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేతలు ఎక్కడికక్కడ గ్రూపులు కట్టడం, రాబోయే ఎన్నికల్లో సీటు కోసం కొట్లాటలు, ఎడతెగని పంచాయితీలు.. ఇవన్నీ కలిసి రేపటి ఎన్నికల్లో వైసీపీ నష్టం చేకూరుస్తాయనే అభిప్రాయం కూడా సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేషన్ పదవిచ్చినా అసంతృప్తే?
కార్పొరేషన్ పదవులు లభించిన చాలామందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జీతభత్యాలు సరిగా లేకపోవడంతోపాటు ఆమ్యామ్యాలు కూడా లభించే పరిస్థితి లేకపోవడంతో పేరు గొప్ప పదవులెందుకు అంటూ సణుగుతున్నారు. అధినేతకు ఎదురుపడి చెప్పే పరిస్థితి లేకపోయినప్పటికీ తెరవెనక గొణుగుళ్లు మాత్రం ఎక్కువయ్యాయని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్న రాయలసీమ నేత ఒకరు జీతం కూడా వద్దని, ఉచితంగానే పనిచేస్తానని ప్రకటించారు. ఎందుకంటే ఇచ్చే వేతనంలో సగానికి సగం తగ్గించడంతోపాటు అధికార లాంఛనాలు కూడా తగ్గించడంతో నిరసనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

నియోజకవర్గంలో రెండు గ్రూపులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎవరికి వారు నేతలుగా చెలామణి అవుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో సన్నిహితంగా ఉండేవారు ఒకవైపు, విజయసాయిరెడ్డితో సన్నిహితంగా ఉండేవారు మరోవైపు మొహరించి యుద్ధ వాతావరణాన్ని తలపింపచేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాన్ని చూపిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్కుమార్ ఎమ్మెల్యేగా ఉండగానే, విజయసాయిరెడ్డి మద్దతున్న ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారంటూ వాసుపల్లి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రులంటే పొసగని ఎమ్మెల్యేలే ఎక్కువ
ముఖ్యమంత్రి కావాలంటే ఎంపీల మద్దతు కాదని, ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గణేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులంటే పొసగని ఎమ్మెల్యేలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వపరంగా పనులు కావాలంటే తాత్సారం చేస్తున్నారని, పనులు చేయనప్పుడు నియోజకవర్గంలో ఈసారి పోటీచేయాలంటే తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజలవద్దకు వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీలో గొణుగుళ్లు ఎక్కువవుతుండటంతో దావోస్ వెళ్లేమందే అసంతృప్త స్వరాలను బుజ్జగించాలంటూ ముఖ్యమంత్రి జగన్ సజ్జలకు ఆదేశాలు జారీచేసి వెళ్లారు. కట్టుదాటి వ్యవహరిస్తున్న నేతల్ని పార్టీ ఎలా అదుపులోకి తీసుకొస్తుందో వేచిచూద్దాం.!!












Click it and Unblock the Notifications