‘నాన్నా’ అంటూ వచ్చి! రూ.7.30లక్షలు కాజేసింది, అసలేం జరిగిందంటే.?
కన్న కూతురునంటూ వచ్చి తన తండ్రిని ఘోరంగా నమ్మించి మోసం చేసింది ఓ యువతి. ఏం చేయాలో తెలియని ఆ తండ్రి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద రూ.7.30లక్షలు కాజేసిందని వాపోయాడు.
పశ్చిమగోదావరి: కన్న కూతురునంటూ వచ్చి తన తండ్రిని ఘోరంగా నమ్మించి మోసం చేసింది ఓ యువతి. ఏం చేయాలో తెలియని ఆ తండ్రి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద రూ.7.30లక్షలు కాజేసిందని వాపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కుక్కునూరులో రెండెకరాలు..
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన బాధితుడు కొర్సా రాజులుకు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. తన మొదటి భార్య, కుమార్తెతో కలిసి దురదపాడులో ఉంటున్నాడు రాజులు.
రూ.50లక్షలు వరకు పరిహారం..
కాగా, రాజులు రెండో భార్య వీరమ్మకు అనిత అనే కుమార్తె ఉంది. పేదరికం కారణంగా 23ఏళ్ల క్రితం రాజులు నుంచి విడిపోయి వీరమ్మ మరో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వీరమ్మ, అనిత విషయం మర్చిపోయిన రాజులు మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే, పోలవరం ప్రాజెక్టు ముంపులో కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలోని రాజులుకు రెండెకరాల పొలం ఉంది. దీనికి పరిహారంగా సుమారు రూ.50లక్షల వరకు రాజు ఖాతాలో జమ కానుంది.
ఆ సొమ్ముపై కన్నేసిన అనిత..
కాగా, పరిహారంగా ఆ డబ్బు రావాలంటే నష్టపోతున్న ప్రాంతంలోనే నివాసముండాలనే నిబంధన ఉండటంతో దామరచర్లలో తన పొలం వద్దకు రాజులు మకాం మార్చాడు. పరిహారం సొమ్ము వస్తుందని తెలిసిన తర్వాత 23ఏళ్ల క్రితం వెళ్లిపోయిన రెండో భార్య వీరమ్మకుమార్తె అనిత.. ‘నానా' అంటూ రాజులు వద్దకు వచ్చి చేరింది.
ఏటీఎం వాడకం..
అంతేగాక, బ్యాంకు ఖాతా, ఏటీఎం వాడకం తండ్రి రాజులుకు నేర్పించింది. చాలా కాలం తర్వాత కూతురు రావడంతో అనితను రాజులు కూడా ఆనందంతో బాగా చూసుకున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు ఏటీఎం నుంచి అనిత సొమ్ములు డ్రా చేసి రాజులుకు ఇస్తుండేది. అప్పుడప్పుడు ఇద్దరు యువకులతో కలిసి వచ్చి తండ్రిని పరామర్శించి వెళుతుండేది. రాజులకు మద్యం తాగే అలవాటు ఉండటంతో ఏటీఎం తన వద్దే ఉంచుకుంది అనిత.
లబోదిబోమన్న రాజులు
అయితే, మూడు నెలలుగా రాజులుకు నగదు అవసరం రాలేదు. తన ఖాతాలో పావు ఎకరం పరిహారంగా రూ.8.60లక్షలు జమ అయ్యాయి. దీంతో అనిత వద్ద ఉన్న ఏటీఎం తీసుకుని.. అవసరాల నిమిత్తం రూ.లక్ష వరకు వాడుకున్నాడు రాజులు. ఆ తర్వాత తన ఖాతాలో సొమ్ము.. తాను తీసుకున్న దానికంటే తక్కువగా ఉండటంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. తనకు తెలియకుండా అనిత రూ.7.30లక్షలు డ్రా చేసినట్లు తెలిసిన రాజులు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. జూన్ 1 నుంచి ఆగస్టు 5 వరకు రూ.7.30లక్షలు వివిధ ఏటీఎంలలో, షాపింగ్ నిమిత్తం డ్రా చేసినట్లు ఎస్బీఐ అధికారుల ద్వారా తెలుసుకుని లబోదిబోమన్నాడు. ఆ తర్వాత నేరుగా పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించాడు.
అనిత కూడా ఫిర్యాదు చేసింది..!
ఏటీఎంలలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. అనితతోపాటు రాజులు ఇంటికి వచ్చిన ఇద్దరు యువకులు కూడా ఉన్నట్లు గుర్తించారు. కాగా, తమకు చెందిన ఖాతాల లావాదేవీల నిమిత్తం ఏటీఎంలకు వెళ్లినట్లు వారు చెబుతుండటం గమనార్హం. అనితే ఈ సొమ్మంతా వాడుకుందా? లేక ఈ ఏటీఎం వేరే వాళ్ల చేతికేమైనా వెళ్లిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, అనిత కూడా కుక్కునూరు పోలీసుస్టేషన్లో మరో ఫిర్యాదు చేసింది. తాను తన తండ్రి వద్ద నుంచి ఏటీఎం కార్డును చోరీ చేయలేదనీ, ఆయనే ఇచ్చారని పేర్కొంది. తన అవసరాల కోసం కొంత డబ్బు వాడినట్లు వివరించినట్లు తెలిసింది. బాధితుడు రాజులు మాత్రం తన కూతురు తనను మోసం చేసిందని చెబుతున్నారు.