దారుణం: ప్రేమకు నో, యువతిని, ఫ్రెండ్ను బైక్తో గుద్ది పడేశారు
తిరుపతి: తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడు మహిళను వెనుక నుంచి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. దీంతో, ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పుడు ఆమె మంచానికే పరిమితమైంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేపీ లేఅవుట్లో నివాసముంటున్న విద్యార్థినిని గతంలో ఆమెతో పాటు చదువుకున్న నవీన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అతని ప్రేమను విద్యార్థిని అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న నవీన్ తన స్నేహితుడు యశ్వంత్తో కలిసి జూన్ 1న మద్యం తాగి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని, ఆమె స్నేహితురాలిని బైక్తో ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ ముందస్తు ప్రణాళికతోనే వాహనాన్ని ఢీకొట్టాడని దర్యాప్తులో తేలింది.
దీంతో, కేసును అలిపిరి పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. వెన్నెముకకు తీవ్ర గాయమవడంతో బాధితురాలు మంచానికే పరిమితమైంది. పోలీసులు నిందితుల పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి పేరు చంద్రిక అని తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలో దారుణం
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెన్నుబొట్ల అగ్రహారంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ముగ్గురు వ్యక్తులను దుండగులు నరికి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి.
సోమవారం గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసిన రుణమాఫీ పత్రాలు తీసుకునేందుకు వచ్చిన ఇరు కుటుంబాల వారు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో ఓ కుటుంబంలోని ఇద్దరు... ప్రత్యర్థి కుటుంబాన్ని హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో దంపతులు బాబు, సుశీలతో పాటు రత్తయ్య అనే మరో వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.