వైసీపీ నేతలతో అంతర్గత భేటీకి జగన్ రెడీ-టార్గెట్ క్లియర్.. !
ఏపీలో 2019లో వైసీపీ సాధించిన 151 సీట్ల ఫీట్ ను మరిపిస్తూ, అంతకు మించి 175 సీట్ల లక్ష్యాన్ని పార్టీ శ్రేణులకు, నేతలకు నిర్దేశించిన సీఎం జగన్ ఇప్పుడు దాన్ని ఎలా సాధించాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సిద్దం సభల్ని నిర్వహించిన జగన్.. పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రేపు వైసీపీలో కీలకమైన దాదాపు 3 వేల మంది నేతల్ని పిలిపించుకుని అంతర్గత భేటీ ఏర్పాటు చేశారు.
ఇప్పటికే భీమిలి, ఏలూరు, అనంతపురం వేదికగా నిర్వహించిన మూడు సిద్దం క్యాడర్ సమావేశాలు సూపర్ సక్సెస్ గా నిలిచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ నిర్వహించనున్న పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాల గురించి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు వివరించేలా సీఎం జగన్ అంతర్గత భేటీ నిర్వహించబోతున్నారు. తద్వారా ఎన్నికలే లక్ష్యంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శిక్షణా ఇస్తూ సిద్దం ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

రేపు మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ నేతలతో భేటీ కానున్నారు. సిద్దం ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జగన్ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహలపై పార్టీ నేతలకు సూచనలు ఇస్తారు. ఎన్నికల్లో బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, మెజారిటీ ఓట్ల సాధనే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సీఎం స్వయంగా బుత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్ర స్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేయడం తొలిసారి అయినా... రేపు వైసీపీ గెలుపులో ఇదే కీలకమని భావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్రంలోని 47,000 బూత్లలో ప్రతి బూత్ కి 15 మంది సభ్యుల బృందాన్ని నియమించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సిద్ధం సభల ద్వారా సంకేతాలు పంపింది. ఇప్పుడు మరో అడుగు వేస్తూ ప్రతి ఒక్క బూత్ పరిధిలో పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించేలా పార్టీ నేతలు, క్యాడర్ కు శిక్షణ ఇవ్వటం, రాజకీయ వ్యూహాల అమలు, లక్ష్యాలుపై సీఎం జగన్ ఈ భేటీలో చర్చిస్తారు.

ఈ భేటీకి హాజరు అయ్యేది వైసీపీలో ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు/నియోజకవర్గ సమన్వయకర్తలు/ ఇంచార్జ్ లు, నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ మండల అధ్యక్షులు, జేసీఎస్ కోఆర్డినేటర్లు, బృందం నియోజకవర్గం, మండలం ప్లస్ బూత్ స్థాయి టీమ్ లీడ్స్ కలిపి దాదాపు 3 వేల మంది వరకు హాజరవుతారు. ఇందులో రాష్ట్ర స్థాయి నేతల నుంచి మండల స్థాయి వరకు ఉన్న కీలకమైన వైసీపీ నేతలంతా ప్రజల మధ్య ఉండేలా గడప గడపకు, సిద్ధం కార్యక్రమాలపై దృష్టి సారించే విధంగా శిక్షణ ఇస్తారు. అలాగే ఈ పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాల ద్వారా ప్రతి బూత్లో కనీసం 60 శాతం ఓట్లను సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోంది. అలాగే ప్రచారంలో జగనన్న స్టార్ క్యాంపెయినర్స్ గా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు.












Click it and Unblock the Notifications