అరగంట టైం అడిగిన జగన్, ఆగ్రహించిన ఎమ్మెల్యే
హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల పైన చర్చలో తనకు అరగంటపాటు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇంకా చాలా విషయాలు ప్రస్తావించాల్సి ఉందని, అందుకే మరో అరగంట సమయమివ్వాలని సభాపతిని కోరారు.
రుణమాఫీ పైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుండి వాకౌట్ చేసి.. అనంతరం సమావేశాలకు హాజరైన వైయస్ జగన్ సమయమివ్వాలని కోరారు. అయితే, స్పీకర్ సమయం ఇవ్వలేదు. గొల్లపల్లి సూర్యారావును ప్రసంగం కొనసాగించాలని సూచించారు.
స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ కలిశారు. సభా హక్కుల ఉల్లంఘనపై స్పీకర్కు చెవిరెడ్డి వివరణ ఇచ్చారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం చెవిరెడ్డిపై అధికారపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే.

వైయస్ పాలనపై గొల్లపల్లి మండిపాటు
వైయస్ పాలనలో రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వైయస్ ప్రతిపక్ష నేతగా ఏ ముఖ్యమంత్రిని ప్రశాంతంగా పని చేయనివ్వలేదన్నారు. తాను మాట్లాడుతుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. జగన్ తన బడ్జెట్ ప్రసంగంలో దళితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. శ్వేతపత్రాలు అంటే జగన్ పార్టీకి భయమెందుకన్నారు.
రాజధాని ఎంపికపై ఆలస్యం చేయం: నారాయణ
ఈ నెల 31వ తేదీలోగా ఏపీ రాజధాని పైన శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇస్తుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వేరుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కమిటీ నివేదిక కాపీని పంపుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు అందుకున్న వెంటనే మంత్రివర్గం సమావేశమవుతుందన్నారు. కొత్త రాజధానిపై నిర్ణయం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications