మరో దత్తాత్రేయలా, ముద్రగడ వెనుక జగన్: తేల్చిన మంత్రులు
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రులు గంటా శ్రీనివాస రావు, చినరాజప్పలు మరోసారి తేల్చి చెప్పారు. ముద్రగడ తాజా లేఖ పైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపు జాతికి మీరే ప్రతినిధిలా మాట్లాడవద్దని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. కాపు జాతికి శాశ్వతంగా నష్టం చేసేలా ముద్రగడ ప్రయత్నిస్తున్నారన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. మిగిలిన వర్గాలను రెచ్చగొట్టేలా ముద్రగడ ప్రవర్తిస్తున్నారన్నారు.
కొందరు వ్యక్తుల చేతిలో ముద్రగడ కీలుబొమ్మగా మారారని చెప్పారు. టీడీపీకి భారీ మెజార్టీ కట్టబెడ్డిన ఉభయ గోదావరి జిల్లాల ప్రజల రుణం తాము తీర్చుకుంటామని చెప్పారు. సున్నిత సమస్యకు శాస్త్రీయ కోణంలో పరిష్కారం ఉంటుందన్నారు. ముద్రగడ రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారన్నారు.

ముద్రగడ వెనుక ఎవరో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. ముద్రగడ లేఖలు రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నవని చెప్పారు. కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. జగన్ మాటలనే ముద్రగడ లేఖల ద్వారా వ్యక్తం చేస్తున్నారన్నారు.
కాపులకు న్యాయం చేయడం ముద్రగడకు ఇష్టం లేదని మండిపడ్డారు. ముద్రగడ లేఖ రాయకముందే తన పేరున పథకాలు పెట్టవద్దని చంద్రబాబు చెప్పారన్నారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖలను అధిగమించేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాపుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము చెబుతున్నామన్నారు. మేం కమిషన వేస్తుంటే ముద్రగడ జీవో గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications