అబద్ధాలు: ఆంధ్రజ్యోతి, ఈనాడులపై జగన్ నిందలు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడినే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9లను కూడా నిందించారు. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఎన్నికల సందర్భంగా అబద్ధాలు ప్రచారం చేసినట్లు ఆయన ఆరోపించారు.
అనంతపురం జిల్లా నేతలతో ఆయన గురువారం నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడి మాదిరిగా తాను అబద్ధాలు చెప్పలేదని, మోసం చేయలేదని ఆయన అన్నారు. ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల నాయకులతో ఆయన మొదట భేటీ అయ్యారు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తమ పార్టీకి 1.30 లక్షల మంది ఓటేస్తే, టిడిపి కూటమికి 1.35 లక్షల మంది ఓటేశారని, టిడిపి కూటమి విజయానికి, మత అపజయానికి మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమేనని ఆయన అన్నారు. ఒక్క కడప ఉప ఎన్నికల్లోనే తమ పార్టీకి 5.30 లక్షల మెజారిటీ వచ్చిందని ఆయన చెప్పారు.
ఎన్నికల్లో ఓటమికి నరేంద్ర మోడీ హవా, రుణమాఫీ ప్రధాన కారణాలుగా చెప్పుకుంటున్నారని, అధికారం కోసం చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీల అమలు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేవనే ఉద్దేశంతో చంద్రబాబు అడ్డగోలు పాలన సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.