మీ వల్లేమౌతుంది: జగన్తో ఓ విద్యార్థి, బరువేసిన విద్యార్థులు! యువభేరీలో తొక్కిసలాట
విశాఖ: ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా విశాఖ పోర్టు స్టేడియంలో వైసిపి యువభేరీలో మంగళవారం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఎన్నారై కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు ఒక్కసారిగా లోపలకు తోసుకు వచ్చారు. ఈ క్రమంలో ఓ విద్యార్థికి గాయం అయింది. ఆ విద్యార్థిని సహచరులు ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థుల భద్రత పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టి సారించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, వైయస్ జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాక... విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
విద్యార్థుల ప్రశ్నలు - జగన్ సమాధానం
ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశ్యంతో నేను చంద్రబాబుకు ఓటేశానని, కానీ తీరా ఇప్పుడు అలాంటిదేం కనిపించడం లేదని రాజేష్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశాంత్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు అంటే ఆసక్తి అని, కానీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వర రావులను చూశాక దారుణంగా అనిపిస్తోందన్నారు. నేను రాజకీయాల్లోకి రావాలా, వద్దా అని జగన్ను ప్రశ్నించారు.
జగన్ మాట్లాడుతూ... చంద్రబాబుది పాత జనరేషన్ అని, మనది ఈ జనరేషన్ అని, మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలన్నారు.
లక్ష్మీ నారాయణ అనే విద్యార్థి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. దిక్కుమాలిన మంత్రులు హోదాల్లో కొనసాగుతున్నారని, వారు రాజీనామా చేసి హోదా కోసం ప్రయత్నాలు చేయాలన్నారు.
జగన్ మాట్లాడుతూ.. హోదా కోసం మనం ఒత్తిడి తెస్తే చంద్రబాబు దిగిరాక తప్పదన్నారు. ఆ తర్వాత బిజెపి కూడా దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నారు.
ఓ విద్యార్థిని మాట్లాడుతూ... ఓసీల్లోను పేదవారు ఉన్నారని, వారి కోసం ఏమైనా చేయాలన్నారు.
జగన్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు.
మరో, బిఎస్సీ సెకండియర్ అమ్మాయి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు అంత చేస్తేనే ఆంధ్ర రాలేదని, మీరు చేస్తే వస్తుందా అని ప్రశ్నించారు.
దానికి జగన్ మాట్లాడుతూ... పొట్టి శ్రీరాములు గారి వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆ తర్వాత మన ఖర్మకొద్ది కాంగ్రెస్, చంద్రబాబు వంటి వారు రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. హోదా మన హక్కు అన్నారు. హోదా కోసం మన ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలోని టిడిపి మంత్రులను ఉపసంహరించుకోవాలన్నారు.
ఓ విద్యార్థి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అంటే, చంద్రబాబు ప్రత్యేక హోదా చూడకు, మాట్లాడకు అంటున్నారని ఎద్దేవా చేశారు.
తేజ అనే విద్యార్థి మాట్లాడుతూ... అయ్యా చంద్రబాబు నీ కొడుకులా (లోకేష్) ఈ రాష్ట్రంలోని యువకులను చూస్తావా లేవా అని ప్రశ్నించారు. నేను జగన్కు అభిమానిని అని, ఆయన సీఎం కావాలన్నారు. మీ పైన అభిమానంతో మీ ఇంటి పేరును పెట్టుకున్నానని చెప్పారు.
జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు ఎప్పుడు మోసాలు చేస్తారని, సాఫ్టువేర్, సెల్ ఫోన్లను నేనే తెచ్చానంటారని, హైదరాబాద్ నేనే కట్టానంటారని ఎద్దేవా చేశారు. ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థంకాదని, అసెంబ్లీలో కూర్చోబెట్టి షో చేస్తారన్నారు. టెక్నాలజీలో చంద్రబాబు కంటే వైయస్ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు.
మా తరఫున జగన్ పోరాడుతారు!
ఎందరో స్టార్లు వచ్చిపోతున్నారని, జగన్ మాత్రం మా స్టార్ అంటూ మరొకరు ప్రశంసించారు. మంచి పని చేయాలని, అది కాకుంటే మాట్లాడమంటారని, అదీ కుదరకుంటే మంచి ఆలోచన చేయమంటారని, ఇప్పుడు జగన్ చేస్తోంది అదే అన్నారు. మేం విద్యార్థులం కాబట్టి నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినప్పటికీ.. మనందరి తరఫున జగన్ పోరాడుతారని చెప్పారు.
ఓ అమ్మాయి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా వల్ల బిసిలకు ఏం లాభమో చెప్పాలన్నారు. జగన్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఇస్తే ప్రతి నగరం హైదరాబాద్ అవుతుందన్నారు. కంపెనీలు ఎక్కడైనా పెట్టవచ్చునని చెప్పారు.