100కి.మీలు పూర్తి: సాగుతున్న జగన్ పాదయాత్ర
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయి చేరింది.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయి చేరింది. కర్నూలు జిల్లా చాగలమర్రి దగ్గర ఆయన పాదయాత్ర 100 కిలో మీటర్లకు చేరుకుంది.
ఈ సందర్భంగా వైయస్ జగన్కు చాగలమర్రి వద్ద గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. వంద కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా గొడిగనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు జగన్.
నవంబర్ 6న ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఏడు రోజులపాటు కడప జిల్లాలో కొనసాగింది. జిల్లాలోని పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర పూర్తి చేశారు.
కడప జిల్లాలో జగన్ మొత్తం 93.8 కిలో మీటర్లు నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో 8వ రోజైన మంగళవారం ఉదయం చాగలమర్రి మీదుగా కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. కాగా, ఈ ప్రజాసంకల్పయాత్ర... శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ కొనసాగనుంది. జగన్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండటం గమనార్హం.