ఉండేవారుంటారు, పోయేవారు పోతారు: జగన్ వైరాగ్యం
న్యూఢిల్లీ: అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కూతురు అఖిలప్రియ పార్టీని వీడడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. వారితో పాటు ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్ కూడా పార్టీ మారడంతో ఆయనను కాస్తా వైరాగ్యం ఆవరించినట్లు చెబుతున్నారు.
నలుగురు శాసనసభ్యులు, ఓ ఎమ్మెల్సీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేత పచ్చ కండువా వేయించుకుంటున్న సమయంలో జగన్ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో బస చేశారు.
సోమవారంనాడు రోజంతా ఆయన వైవీ సుబ్బారెడ్డి నివాసంలోనే ఉన్నారు. ఆ సమయంలో పని మనుషులను కూడా బయటకు పంపించి కొద్ది మంది ముఖ్యులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా సమాచారం ఇవ్వకుండా ఆయన ఢిల్లీకి వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి పర్యటన ముందుగానే ఖరారైంది. జాట్ల ఆందోళతో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అందుబాటులో లేరు మంగళవారంనాడు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండడంతో సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయినా జగన్ ఢిల్లీలోనే ఉన్నారు.