ఇళ్లలోకి వస్తారా, హక్కు ఎవరిచ్చారు: అర్థరాత్రి దాడులపై జగన్
అర్థరాత్రి పోలీసులు ఇళ్లపై దాడులు చేయడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శివమెత్తారు. శనివారం ఆయన నంద్యాలలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి హాజరై ప్రసంగించారు.
నంద్యాల: అర్థరాత్రి పోలీసులు ఇళ్లపై దాడులు చేయడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శివమెత్తారు. శనివారం ఆయన నంద్యాలలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి హాజరై ప్రసంగించారు.
అర్థరాత్రి ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తూ కుటుంబాల్లోని మహిళలను, చిన్న పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నంద్యాల పట్టణంలోని కొందరి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
సెర్చ్ వారంట్లు లకుండా సోదాలు జరిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు, నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఆ అవసరం ఏమిటి....
సత్యనారాయణ, రమేష్ వంటి వాళ్ల ఇళ్లపై పోలీసులు రాత్రి పూట దాడులు చేయాల్సిన అవసరం ఏమిటని జగన్ అడిగారు. సోదాల్లో ఏమైనా దొరికిందా అంటే అదీ లేదని ఆయన అన్నారు. ఇంట్లో ఏది దొరికిత దాన్ని సీజ్ చేస్తారని ఆయన అన్నారు..
సీజ్ చేసింది ఇంతే..
అమృతరాజ్, నాగిరెడ్డి, జగదీశ్వర రెడ్డి, రామలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, బాల హుస్సేన్, భువనేశ్వర్ల ఇళ్లపైనా దాడులు చేశారని, ఇళ్లపై దాడులు చేసి రూ 10 వేలు, రూ. 20 వేలు సీజ్ చేశారని జగన్ చెప్పారు. ఈ దాడులకు సంబంధించి ఒక్క వారంట్ కూడా ఉండదని ఆయన అన్నారు. ఒకేసారి 40, 50 మంది పోలీసులు బిలబిలా ఇళ్లలోకి వస్తారని, వాళ్లను చూసి మహిళలూ పిల్లలూ భయపడిపోతున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు మోసం చేశారు....
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా గడిచిన మూడున్నర ఏళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు... సమాజంలోని అన్ని వర్గాలవారు చంద్రబాబు మోసం చేశారని ఆయన అన్నారు.
చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి.
ముఖ్యమంత్రి హోదాలో 2014లో కర్నూలు జెండా ఎగరేసి జిల్లాకు చాలా హమీలను చంద్రబాబు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదనే విషయం జిల్లావాసులకు తెలిసిందేనని జగన్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని, మోసకారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.