ఓయు క్యాంపస్లో వైయస్ జగన్ చిత్రానికి ఘాట్(ఫోటో)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సమాధి కట్టారు. ఈ నెల 26వ తేదిన హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య శంఖారావం సభను తలపెట్టిన విషయం తెలిసిందే.
జగన్ తెలంగాణ వ్యతిరేకి అని, మొదట కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పుడు సమైక్య రాష్ట్రమంటున్నారని విమర్శించారు. జగన్ వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఉస్మానియా క్యాంపస్లోని ఎన్సిసి ద్వారం వద్ద ఆయన చిత్ర పటానికి సమాధిని కట్టారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జిల్లాకో సోనియా ఘాట్: తెలుగు యువత
రాష్ట్రాన్ని విభజించి గవర్నర్ పదవి పొందాలన్న భావనతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని తెలుగు యువత ఆరోపించింది. డెబ్బై రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గ్రామానికో సమాధి, మండలానికో చిదంబరం ఘాట్, నియోకవర్గానికి ఓ దిగ్విజయ్ సింగ్ స్మృతి చిహ్నం, జిల్లాకు ఒకటి చొప్పున సోనియా ఘాట్ను ఏర్పాటు చేస్తామని వారు హెచ్చరించారు.